ఎర్రన్నాయుడి కొడుకు ఉద్వేగ ప్రసంగం, శభాషన్న బాబు
రాష్ట్రం నలుమూలల నుంచి ఉప్పెనలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల వరకు పనిచేసి టిడిపిని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును అధిష్ఠింపజేయాలని, ఢిల్లీలో తెలుగుదేశం చక్రం తిప్పాలని ఆకాంక్షించారు. తన తండ్రి ఆశయం కూడా అదేనని, దాన్ని నెరవేర్చే బాధ్యత శ్రీకాకుళం జిల్లా ప్రజలు తన భుజస్కంధాలపై మోపారన్నారు. అందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రసంగం తర్వాత రామ్మోహన్ను పిలిచి శెభాష్ అంటూ బాబు భుజం తట్టారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పితృ ద్రోహిగా మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు అభివర్ణించారు. వేల కోట్ల రూపాయల దోపిడీని సిబిఐ బయటపెడుతున్నా జగన్ ఇంకా రాజకీయాలు చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. జాతి సంపదను కాంగ్రెస్ నేతలు దోపిడీ చేస్తున్నారని, కాంగ్రెస్ దోపిడీ పార్టీకాగా జగన్ పార్టీ గజదొంగల పార్టీ అని మరో నేత అయ్యన్నపాత్రుడు అభివర్ణించారు.