పారిశ్రామికవేత్తలకే పెద్దపీట: బాబుపై కడియం ఫైర్

తనకు రాజకీయ జన్మ ఇచ్చిన టిడిపిలో ఇమడలేక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేక మనస్తాపానికి గురవుతున్నానని, తెలంగాణ ప్రజలను తెలుగుదేశం మోసం చేస్తోందని ఆయన అన్నారు. 1999 తర్వాత పార్టీలో మార్పులు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రయత్నాలు జరిగాయని, అనేక ప్రయోగాలు జరిగాయని, సంస్కరణలు తెచ్చారని, కానీ అవి ప్రజలకు ఉపయోగపడుతాయా, లేదా అనే ఆలోచన చేయలేదని, దీంతో పార్టీ కార్యకర్తలకూ ప్రజలకూ దూరమవుతూ వచ్చిందని కడియం అన్నారు. ప్రజలు, కార్యకర్తలు దూరమవుతున్న విషయాన్ని పార్టీ నాయకత్వం గుర్తించలేకపోయిందని ఆయన అన్నారు. లోపాలనే సరిదిద్దుకునే ప్రయత్నం జరగలేదని ఆయన అన్నారు.
నాయకత్వం తీరు వల్ల పార్టీ 2004, 2009 ఘోరంగా ఓడిపోయందని, ఆత్మ విమర్శకు పూనుకోలేదని, సమీక్ష చేసుకోలేదని, అంతా బాగుందనే ఆత్మసంతృప్తితో ఉంటున్నామని, పలు సందర్భాల్లో తాను పరిస్థితిని చంద్రబాబుకు వివరించానని, చంద్రబాబు పెడచెవిన పెట్టారని ఆయన అన్నారు. 1999 తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడం మానేశామని ఆయన అన్నారు. 2009 ఎన్నికలు ముగిసి నాలుగేళ్లవుతోందని, మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని, ఇప్పటి వరకు తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లుంటే 13 సీట్లకు ఇంచార్జీలు లేరని, 119 శానససభా నియోజకవర్గాలుంటే 35 స్థానాలకు ఇంచార్జీలు లేరని ఆయన అన్నారు.
పార్టీ నిర్మాణంలోని లోపాలను నాయకత్వ దృష్టికి తెస్తే అరణ్య రోదనే అయిందని ఆయన అన్నారు. పార్టీలో ఎవరికివారే యమునా తీరే అన్నట్లుందని, ఏ ఒక్క జిల్లాలో కూడా సమన్వయం లేదని, నలుగురు కూర్చునే పరిస్థితి లేదని, పనిచేసే పరిస్థితి లేదని, ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు.
నలుగురు కలిసి మాట్లాడుకునే స్థితి లేదు..
క్రమశిక్షణ లేకుండా పోయింది. కలిసి పార్టీని కాపాడుకుందామనే ఆలోచన లేకుండా పోయింది.
పార్లమెంటు సమావేశంలో ఎఎఫ్డిఐలపై ముగ్గురు ఓటింగులో పాల్గొనలేదు. క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. పార్టీ అడగలేకపోయింది. ఇంతకన్నా దరిద్రం లేదు
పార్టీలు మారి, పదవులు అనుభవించి, ఓటమికి కారణమై, భ్రష్టు పట్టించినవారికి మంచి స్థానం దొరుకుతుంది.
పారిశ్రామికవేత్తలకు, పార్టీని నిందించి బయటకు వెళ్లి తిరిగివచ్చినవారికి పదవులు లభిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పదవులు అమ్ముకునే దుస్థితికి పార్టీ వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందని అన్నారు. పదవుల పంపకంపై పార్టీ పోలిట్బ్యూరోలో చర్చ జరగడం లేదని, ముఖాముఖి సమావేశాలు జరుగుతున్నాయని, ఆ సమావేశాల్లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియనది, సమిష్టి నిర్ణయాలు లేకుండా పోయాయని, తెలంగాణ ప్రజల మనోభావాలను పార్టీ గుర్తించడం లేదని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ విధానానికి నీళ్లొదిలారు..
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కాంగ్రెసు విధానానికి తెలుగుదేశం పార్టీ నీళ్లొదిలిందని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెసు వ్యతిరేక పునాదులపై ఎన్టీ రామరావు టిడిపిని స్థాపించారని, కాంగ్రెసు వ్యతిరేక వర్గాలన్నీ ఎన్టీఆర్ వెనక నడిచాయని, ఈ మధ్య పరిణామాలు పార్టీ కాంగ్రెసుకు చేరువ అవుతోందనే అభిప్రాయాన్ని బలపరుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు వచ్చినప్పుడు తటస్థంగా ఉండిపోయామని, దాని వల్ల కాంగ్రెసును దెబ్బ తీసే అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయామని ఆయన అన్నారు. దానివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుతోందనే అపవాదును అనుభవిస్తున్నామని ఆయన అన్నారు. తాను ఈ విషయాన్ని తాను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పానని, అయినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను తెలుగుదేశం పార్టీ అయోమానికి గురి చేస్తోందని, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు.
తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాడబోనని చంద్రబాబు చెబుతున్నారే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నానని చెప్పడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన అన్నారు. దీంతో తెలంగాణ ద్రోహులుగా నిలబడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications