మరో బుకీ అరెస్టు, రూ. 1.26 కోట్లు, కిలో గోల్డ్ సీజ్
దేశంలో పెద్ద యెత్తున బెట్టింగులు జరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు బుకీలపై నిఘా వేశారు. నగరంలోని ప్రహ్లాద నగర్ సమీపంలో ఉన్న ఇంద్రప్రస్థ్ టవర్ 6లో నివాసం ఉంటున్న వినోద్ మూల్చందాని అనే బుకీ శుక్రవారం భారీ మొత్తంలో బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తయమ్యారు. శనివారం ఉదయం అతని నివాసంపై దాడి చేసి మూల్చందానిని అరెస్టు చేశారు.
మూల్చందాని గత 15 ఏళ్లుగా క్రికెట్ బెట్టింగు వ్యవహారాలు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మూల్చందానికి భావనగర్లో ఆర్సి సెటర్ అనే కొరియర్ సంస్థ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని అతను బెట్టింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చేసినందుకు అతన్ని గతంలో భావనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
గత ఐపియల్ సీజన్లో బెట్టింగ్ కోసం అతను భోపాల్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పుడు అహ్మదాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతనికి ప్రత్యక్ష సంబంధాలు లేకపోవచ్చునని పోలీసులు అంటున్నారు.