వల్లభనేని వంశీపై దేవినేని స్కెచ్: హరికృష్ణతో రాజకీయం!

రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పెళ్లి కోసం జిల్లాకు వచ్చారు. ఆయన జిల్లాలోనే మూడు రోజులు తిష్ట వేసి జిల్లా నేతలతో మంతనాలు జరిపారు. హరిని దేవినేని ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన రావు తదితరులు కలుసుకున్నారు. రాజకీయాలు మాట్లాడలేదని చెబుతున్నప్పటికీ వారి మధ్య టిక్కెట్ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దేవినేని ఉమ తన ప్రత్యర్థులు వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్ రావుకు చెక్ చెప్పేందుకు హరి వద్ద కూడా తన వంతు ప్రయత్నాలు చేశారట.
విజయవాడ పార్లమెంటు స్థానం కోసం వల్లభనేని వంశీ, కేశినేని నానిల మధ్య హోరీ హోరీ నెలకొంది. నానిని ఇప్పటికే చంద్రబాబు ఇంఛార్జిగా నియమించారు. దీంతో వల్లభనేని వెనక్కి తగ్గారు. అయితే గద్దె రామ్మోహన రావు లోకసభ స్థానంపై పట్టుబడుతున్నారు. ఆయన నేరుగా చంద్రబాబుతో ఈ విషయాన్ని చెప్పారు. లోకసభ టిక్కెట్ కోసం ఆయన చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. హరికృష్ణతో భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
గన్నవరం టిక్కెట్ కోసం వల్లభనేని వంశీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాలవర్ధన రావు మధ్య పోటీ నెలకొంది. టిక్కెట్ తనకే కావాలని బాలవర్ధన రావు చెబుతుండగా.. గన్నవరం టిక్కెట్ ఇవ్వకుంటే వంశీ ఏం చేస్తారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే బాలకృష్ణ పెనమలూరు నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. నిన్న హరికృష్ణను కలిసిన దేవినేని ఆయన ముందు గన్నవరం ప్రతిపాదన పెట్టారట.
హరికృష్ణకే పోటీ చేయమన్నారా లేక మరేదైనా చెప్పారా అనే చర్చ సాగుతోంది. ఏం చెప్పినా వంశీకి చెక్ పెట్టే ప్లాన్తోనే ఆయన వెళ్తారని అంటున్నారు. అయితే, వంశీ జూనియర్ ఎన్టీఆర్ వర్గం కాగా దేవినేని చంద్రబాబు నాయుడు వర్గం నేతగా ముద్రపడ్డారు.












Click it and Unblock the Notifications