నేతలు వెదవలు: రగులుతున్న సీమాంధ్ర, ఆత్మహత్యలు
అనంతపురం/నెల్లూరు/విశాఖ/గుంటూరు: సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం మూడో రోజు కూడా కొనసాగుతోంది. శుక్రవారం విద్యార్థులు, యువకులు, ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రమంత్రులు పళ్లం రాజు, పనబాక లక్ష్మి, పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ఆందోళనకారులు ముట్టడించారు. వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిని సీమాంధ్రలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. జిల్లాల్లో మూడో రోజు కూడా బస్సులు రోడ్లెక్కలేదు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్ల పైన టైర్లు కాల్చివేశారు. పలుచోట్ల విద్యార్థులు, యువత మానవహారం నిర్వహించారు. జమ్మలమడుగులో యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన రాకుంటే తాము దేనికైనా సిద్ధమని హెచ్చరించారు.
మదనపల్లె, పలమనేరు, జంగారెడ్డి... ఇలా పలు ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి విగ్రహానికి కూడా నిప్పు పెట్టారు. అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం ఉండటంతో 144వ సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. గుంపులుగా తిరుగవద్దని పోలీసులు హెచ్చరించారు. పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్సుప్రెస్ను అడ్డుకున్నారు.
విజయనగరంలోని ఎస్ కోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించారు. డోన్లో టిడిపి భారీ ర్యాలీని నిర్వహించింది. తమ ప్రాంత నేతలు చేతకాని దద్దమ్మలు అని, అందుకే కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని సమైక్యవాదులు మండిపడుతున్నారు.
సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన రాకుంటే రాజకీయ సంక్షోభం సృష్టిస్తామని హెచ్చరించారు. కేంద్రమంత్రి పదవుల కోసం కావూరి సాంబశివ రావు, చిరంజీవి వంటి నేతలు తమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని, వారు ఈ ప్రాంతం వాసులుగా అనుకుంటున్నట్లుగా లేదన్నారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వెదవలని, పదవుల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడుతున్నారు.
ఇద్దరి బలిదానం
రాష్ట్రం రెండు ముక్కలయ్యిందన్న బాధ తట్టుకోలేక కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థులు బలిదానాలు చేసుకోగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరుకు చెందిన బాలరాజు, విష్ణు స్నేహితులు. రాష్ట్ర విభజన వార్తలను టీవీలో చూసిన వీరిద్దరూ దానిపైనే చర్చించుకున్నారు.
గురువారం ఉదయం క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న వీరిని స్థానికులు గమనించారు. బాలరాజు అప్పటికే చనిపోగా, విష్ణు కొన ఊపిరితో ఉన్నాడు. అతణ్ని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి, అక్కణ్నుంచీ కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరోవైపు రాష్ట్ర విభజనకు సంబంధించిన వార్తలను టీవీలో చూస్తూ తట్టుకోలేక గుండెపోటుతో ఆరుగురు మృతి చెందారు. పలువురు ఆత్మహత్యాయత్నం చేశారు.












Click it and Unblock the Notifications