అదీ రాజకీయ కుట్రే.. రెండురోజుల్లో గుర్తిస్తాం, పవన్పై మంత్రి బొత్స ఫైర్
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ తిప్పికొట్టారు. కోనసీమ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. అందుకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో కుట్రదారుల పేర్లు బయటికి వస్తాయని అన్నారు.
పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో అతడికే అర్థం కావడంలేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. జిల్లా పేరు మార్పు కోసం 30 రోజులు సమయం ఇవ్వడం ఒక నిబంధన అని, పవన్ కల్యాణ్ ఏమీ తెలియకుండా మాట్లాడుతుండడం పట్ల అతడిపై సానుభూతి కలుగుతోందని అన్నారు. తుని అంశంలో కాపు ఉద్యమాన్ని కించపరిచేలా పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
పవన్ను ప్రజలు క్షమించరని అన్నారు. తుని సంఘటనలో తన పేరుతో పాటు ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు పేర్లు ఉన్నాయని, వాళ్లు కూడా వైసీపీ నేతలా? అని పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ నేతల ఇళ్లను తామే ఎందుకు తగలబెట్టిస్తామని ప్రశ్నించారు.
మామ ఇంటిపై రాళ్లు వేయించి, అల్లర్లు సృష్టించిన చరిత్ర తమది కాదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరుపెట్టాలని విపక్షాలు కోరలేదా? అని బొత్స నిలదీశారు. అల్లర్ల వెనక ఎవరు ఉన్నారో తేలనుందని స్పష్టంచేశారు. విచారణలో తేలిన తర్వాత.. తప్పకుండా వెల్లడిస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు.