తనకంటే ముందు పెళ్లి చేస్తారా? అంటూ.. తల్లీ, సోదరుడికి నిప్పుపెట్టాడు
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామంలో జరిగిన దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లి జరగకుండా తమ్ముడికే సంబంధం కుదిరిందన్న అక్కసుతో ఓ దుర్మార్గుడు.. మద్యం మత్తులో కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని గాయపరచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. యితలి పంచాయతీ సదురుమామిడి గ్రామానికి చెందిన శ్రీను మద్యానికి బానిసై అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో అతనికి పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చిన్నకుమారుడు చంటిబాబుకు పెళ్లి చేద్దామని సంబంధం కుదిర్చారు.

ఇది ఓర్చుకోలేని శ్రీను కన్న తల్లి, తండ్రి, తోడపుట్టిన తమ్ముడు నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అలికిడికి పడుకున్న తండ్రి లేచి పెద్ద కుమారుడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తండ్రిపై దాడి చేసిన శ్రీను అక్కడి నుంచి పరారయ్యాడు.
మారుమూల ప్రాంతం కావడంతో వాహనాలు, అంబులెన్స్ గాని అందుబాటులో లేవు. దీంతో నిందితుడి తల్లి చిట్టమ్మ, సోదరుడు చంటిబాబులు తెల్లవార్లూ కాలిన గాయాలతో బాధపడుతూ చిత్రవధను అనుభవించారు. చివరకు వైద్యసిబ్బందికి సమాచారం అందించి, ప్రత్యేక అంబులెన్స్లో ఈ ఉదయం 10.30 గంటలకు పాడేరు ఏరియా ఆసుపత్రి తీసుకొచ్చినట్లు తండ్రి పోతురాజు తెలిపారు. ప్రస్తుతం ఆ తల్లి, కొడుకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications