అల్లుడితో అక్రమ సంబంధం: తల్లి కామవాంఛ కూతురు జీవితం నాశనం చేసింది!
ప్రకాశం: ఓ తల్లి కామవాంఛ కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న ఆమె.. ఆ యువకుడితోనే తన కుమార్తెకు వివాహం చేసింది. ఆ విషయం తెలియడంతో కూతురు అతనితో గొడవపడింది. దీంతో సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
యువకుడితో వివాహేతర సంబంధం..
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కొత్త ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకరశర్మ(35)కు గుంటూరులో చదువుకునే రోజుల్లో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రవిశంకరశర్మ కుటుంబసభ్యులు.. దోర్నాలకు చెందిన యువతితో అతనికి వివాహం చేశారు.
యువకుడికి పెళ్లైనా.. విడాకులిప్పించి మరీ..
అయితే, పెళ్లైనప్పటికీ ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు రవిశంకరశర్మ. ఈ క్రమంలోనే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో రవిశంకరశర్మతో అతని భార్యకు సదరు మహిళ విడాకులు ఇప్పించింది. ఆ తర్వాత అతడు హైదరాబాద్ వెళ్లి అక్కడే తన బంధువుల వద్ద ఉంటున్నాడు. పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
తల్లి, భర్త వ్యవహారం తెలిసి..
ఈ క్రమంలో గుంటూరుకు చెందిన సదరు మహిళ తన పెద్ద కుమార్తెను రవిశంకరశర్మకు ఇచ్చి రెండో వివాహం చేసింది. అయితే, కొద్ది రోజులకే భర్తకు, తన తల్లికి మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయం ఆమెకు తెలిసింది. దీంతో ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
చివరకు ఆత్మహత్య చేసుకున్న అల్లుడు..
ఈ నేపథ్యంలోనే గత శనివారం రాత్రి కురిచేడు రైల్వే స్టేషన్కు వచ్చిన రవిశంకరశర్మ.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవిశంకరశర్మ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అతని జేబులో ఉన్న సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ లేఖ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కామవాంఛ కారణంగా కూతురు జీవితం నాశనం అయ్యిందని స్థానికులు సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.