చంద్రబాబుతో పవన్ మరోసారి - టార్గెట్ జగన్, కలిసికట్టు వ్యూహం..!!
ఏపీలో రాజకీయం మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు జైలులో ఉండటం.. ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది ఆ రెండు పార్టీలకు సంక్లిష్టంగా మారింది. ఈ సమయంలోనే భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయటానికి లోకేశ్ - పవన్ నాయకత్వంలో రెండు పార్టీల సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగనుంది.
తొలి సమావేశం:టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైన తరువాత జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం సోమవారం రాజమహేంద్రవరంలో జరగనుంది. సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అఽధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. వీరితో పాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరవుతారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఉన్న సంగతి తెలిసిందే. జనసేన సమన్వయ కమిటీ చైర్మన్గా నాదెండ్ల మనోహర్, సభ్యులుగా కందుల దుర్గేశ్, తెలంగాణకు చెందిన మహేంద్రరెడ్డి, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్విణి, బొమ్మిడి నాయకర్ ఉన్నారు.

ఉమ్మడి కార్యాచరణ:విజయదశమి నాడు రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా గల మంజీరా ఇంటర్నేషనల్ హోటల్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది. విజయవాడ నుంచి లోకేశ్ ఆదివారం రాత్రికే రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఒక పక్క పవన్ వారాహి యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. భవిష్యత్కు గ్యారంటీ పేరుతో గతంలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాన్ని లోకేశ్ నిర్వహించనున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల అమలుపై రాజమహేంద్రవరం వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

చంద్రబాబుతో సమావేశం:భువనేశ్వరి యాత్రకు పవన్ సంఘీభావం ప్రకటించనున్నారు. అదే విధంగా పవన్ వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని ఇప్పటికే టీడీపీ పిలుపు ఇచ్చింది. లోకేశ్ నిర్వహించే భవిష్యత్కు గ్యారంటీ యాత్రకు జనసైనికులు మద్దతు ఇచ్చేలా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాల పైన చర్చ ఉంటుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.
ఇదే సమయంలో బీజేపీ వైఖరి...ఆ పార్టీతో వ్యవహరించే విధానం పైన చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబును కలుస్తారని సమాచారం. అయితే..భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి మాత్రమే చంద్రబాబును కలుస్తారని..పవన్ కలవటం పైన స్పష్టత లేదని చెబుతున్నారు. దీంతో, ఈ రోజు రాజమండ్రి వేదికగా తీసుకొనే నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications