రివర్స్: కెసిఆర్తో ఎపిలో ఓటమి, బాబుతో టిలో గెలుపు!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటముల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయా పార్టీలు సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా నాయకుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోందట. సమైక్యాంధ్రప్రదేశ్లో కెసిఆర్ కారణంగా టిడిపి అధ్యక్షులు చంద్రబాబును ఓడిపోతే... తెలంగాణలో చంద్రబాబు కారణంగా కెసిఆర్ గెలిచారని వ్యాఖ్యానిస్తున్నారట.
2009 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, తెరాస, లెఫ్ట్ పార్టీలు మహా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. నాడు.. ప్రజారాజ్యం, లోక్సత్తా పార్టీలు రాకపోయి ఉంటే లేదా తెరాసతో పొత్తు లేకుంటే టిడిపి అధికారంలోకి వచ్చేదనే వాదనలు ఉన్నాయి. చిరంజీవి స్థాపించిన పీఆర్పీ నాటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చింది.
దానికి తోడు తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత కర్నూలు జిల్లా ప్రచారంలో వైయస్ మాట్లాడుతూ... హైదరాబాదుకు వెళ్లాలంటే వీసా కావాలా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం సీమాంధ్రలో జరిగిన ఎన్నికల పైన పడిందని అంటారు. వైయస్ వ్యాఖ్యల ప్రభావం తెరాసతో పొత్తు పెట్టుకున్న టిడిపి పైన పడిందని, అందుకే సీమాంధ్రలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారని గుర్తు చేసుకుంటున్నారట. అలాగే పీఆర్పీ కూడా టిడిపిని దెబ్బతీసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా... 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కారణంగా తెరాస అధికారంలోకి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెరాసకు బిజెపి గట్టిగా పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోయినప్పటికీ.. చాలా స్థానాల్లో తెరాస ఓటమికి కారణం అవుతుందనే ప్రచారం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉన్న బిజెపి... తెరాస స్థాయిలో కాకున్నా బాగా పుంజుకుంది.
ఈ కారణంగానే ఒంటరిగా పోటీ చేసేందుకు తెలంగాణ బిజెపి సిద్ధమైంది. బిజెపి ఒంటరిగా పోటీ చేసి ఉంటే... ఇరవై అయిదుకు పైగా సీట్లు వచ్చి ఉండేవని, ఆ ప్రభావం తెరాస పైన పడి ఉండేదని అభిప్రాయపడ్డారు.
అయితే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన టిడిపితో బిజెపి జత కట్టడంతో హైదరాబాదులో గెలుచుకున్న ఐదు స్థానాలు మినహా ఎక్కడా ప్రభావం చూపలేకపోయిందని అంటున్నారు. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే తెరాసకు అన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదని, టిడిపితో బిజెపి జత కట్టడం తెరాసకు కలిసి వచ్చిందనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. తెలంగాణ బిజెపి నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు