అండగా ఉంటా, మీకు తెలీకుండా ఏదీ జరగదు: రాజధాని రైతులకు సీఎం జగన్ హామీ
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత కొంత కాలంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతానికి చెందని పలువురు రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం సీఎం క్యాంపు కార్యాయలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
అండగా ఉంటామని సీఎం హామీ
రాజధాని ప్రాంతంలోని నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాల రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన వినతులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ భేటీలో రైతులకు సీఎం వైఎస్ జగన్ పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. భేటీ అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ.. తమకు అండగా ఉంటామని సీఎం జగన్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. రైతులను సంప్రదించకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోమని చెప్పినట్లు వెల్లడించారు.
Recommended Video
రైతుల సమస్యలపై సానుకూలంగా..
రాజధాని రైతు కూలీలకు ఇస్తోన్న పింఛనును రూ. 2500 నుంచి రూ. 5వేలకు పెంచినందుకు సీఎంకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. తమ భూముల్లో తాము వ్యవసాయం చేసుకునేలా సీఎం జగన్ ఆదేశాలిచ్చారని చెప్పారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఆరేళ్లుగా తాము ఎంతగానో పోరాడుతున్నామని.. తమ సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
అభివృద్ధి చేయాలని కోరిన రైతులు
తమ ప్రాంతంలో కళాశాలలు, అభివృద్ధి పనులు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. రాజధానికి అనుకూల ప్రాంతం కాదని ముంపు ప్రాంతమని తాము అప్పుడే చెప్పామని తెలిపారు. ఇక సీఆర్డీఏ నుంచి తమ గ్రామాలను తొలగిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. గ్రామాల్లో సంస్థలు తీసుకురావడం ద్వారా తమ ప్రాంతం అభివృద్ధి చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే, సీఎం హామీ రాజధాని ప్రాంత ఇతర రైతులు కూడా ఆందోళన విరమిస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆ 5వేల ఎకరాల భూములపై..
సీఎంతో భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారని చెప్పారు. రాజధాని రైతులకు కౌలు పెంచినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని రైతులు సీఎంను కోరినట్లు తెలిపారు. మంగళగిరి, తాడికొండలో బలవంతంగా 5వేల ఎకరాల భూసేకరణ చేసిన దేశాలను వారం పదిరోజుల్లో ఉపసంహరించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారని చెప్పారు.
రాజధాని రిజర్వు జోన్తు ఎత్తివేత..
రాజధానిలో రిజర్వు జోన్లు ఎత్తివేసేందుకు సీఎం జగన్ అంగీకరించారని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. అంతేగాక, రైతులు కోరిన విధంగా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సీఎం సూచించారని చెప్పారు. రాజధానిని తరలించడం లేదని, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చెప్పారని తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి పట్టణాల తరహాలో గ్రామాలను అభివృద్ధి చేయాలని రైతులు కోరారని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లో రహదారులు సహా అభివృద్ధి పనులను 3 నెలలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.