లోకేశ్ కోసం పోటాపోటీ ప్రకటనలు: ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా?
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. 'ఇప్పుడు కాదు... తరువాత ఎప్పుడైనా చూద్దాం' అంటూ సాక్షాత్తు పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించినా ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు ససేమేరా అంటున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేశ్ను తీసుకోవాలని కొందరు కోరితే... ఏకంగా కేంద్ర కేబినెట్లో లోకేశ్ మరింత మెరుగ్గా రాణిస్తారని మరికొందరు నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో, లేదంటే అటు కేంద్రంలో ఎక్కడ లోకేశ్కు చోటు కల్పించినా ఆయన కోసం తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని అంటున్నారు.
అంతేకాదు నారా లోకేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం లోకేశ్ విశాఖ వెళ్లిన సమయంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇద్దరూ రాజీనామాపై పోటాపోటీ ప్రకటనలు చేశారు.
కేంద్ర కేబినెట్లో లోకేశ్కు స్థానం కల్పిస్తే తన పదవికి రాజీనామా చేసి ఆ సీట్లో నుంచి లోకేశ్ను ఎంపీగా గెలిపించుకుంటానని తొలుత ముత్తంశెట్టి ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడిన పీలా గోవింద్ కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేశ్ను తీసుకుంటే తన పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అంతేకాదు లోకేశ్ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించారు. మరోవైపు లోకేశ్ కోసం నేతలు పోటా పోటీ ప్రకటనలు చేసిన వైనాన్ని మంత్రులు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.