జేసీ ప్రఖాకర్రెడ్డికి ఊరట.. కరోనా నేపథ్యంలో షరతులతో బెయిల్ ఇచ్చిన అనంతపురం కోర్టు...
అనంతపురం: పోలీసు అధికారులను దూషించిన కేసులో అరెస్ట్ అయి ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జైల్లో ఉండగా జేసీ ప్రభాకర్రెడ్డికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో షతులతో కూడిన బెయిల్ను అనంతపురం కోర్టు మంజూరు చేసింది.
అనంతపురం జిల్లాలో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాల అనుమతికి స్ధానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి వాగ్వాదానికి దిగారు.
పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఆయనపై మళ్లీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా కరోనా వైరస్ సోకింది. బెయిల్ లభించడంతో ఆయన్ను ఎక్కడికి తరలిస్తారో చూడాల్సి ఉంది.