ఫిబ్రవరిలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్...ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా వెల్లడి
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ సమాయత్తమవుతోందా?...అంటే ఈసీ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం అవుననే నిర్థారిస్తోంది.
ఫిబ్రవరి 3 వ వారంలో ఎపికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని ఎపి ఎన్నికల సంఘం ప్రధానాధికారి సిసోడియా వెల్లడించారు. నవంబర్ 14 నుంచే విడతల వారీగా రాష్ట్రానికి వీవీ ప్యాట్లు తీసుకురానున్నట్లు సిసోడియా తెలిపారు. అలాగే ఈవీఎంల సెక్యూరిటీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు గాను బిహెచ్ఈఎల్ కంపెనీకి పంపిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు కొత్తగా 30 లక్షల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటికి ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 కోట్లకు చేరినట్లు ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా తెలిపారు.
ఇదిలావుంటే ఎనిమిది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ఎన్నికల కమీషన్ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అయితే మిగిలిన రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరపాలంటే...అందుకు అవసరమైనన్ని వివిప్యాట్లు లేకపోవడమే ప్రధాన సమస్య అని ఎలక్షన్ కమీషన్ పేర్కొన్నట్లు తెలిసింది.
ఎన్నికల కమీషన్ అంచనా ప్రకారం ప్రస్తుతం లోక్ సభతో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు 14 లక్షల వివి ప్యాట్లు అవసరం. ఈ నేపథ్యంలో మొత్తం 17.4 లక్షల వివిప్యాట్ల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది.