సంబంధంలేని దాంట్లో తలదూర్చారా: మరో వివాదంలో పీతల సుజాత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మరో వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం రూ.10 లక్షల నగదు విషయంలో ఆమె చిక్కులు ఎదుర్కొన్నారు. తాజాగా, తనది కాని శాఖల్లో తలదూర్చారనే చిక్కుల్లో పడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద భూమి విషయంలో ఫైలు కావాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. సుజాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు మహిళా సాధికారత, గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పీతల సుజాత అడుగుతోంది అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదానికి సంబంధించినదని వార్తలు వస్తున్నాయి. తన శాఖకు సంబంధం లేని అంశంపై ఆమె పదేపదే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.
పగో జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామంలో 47 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఈ భూమి తమది అని అటవీ శాఖ చెబుతోంది. తమ భూమిపై రెవెన్యూ అధికారులు ప్రయివేటు వ్యక్తులకు పట్టాలు ఇచ్చారని ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతోంది.
ఈ భూమి పైన అటవీ, రెవెన్యూ, సర్వే శాఖలు జాయింట్ సర్వే చేపట్టి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే కొనసగుతోంది.
మంత్రి పీతల సుజాత చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈ సమస్య పరిష్కారానికి సుజాత.. సర్వే నివేదిక కోరడం, దానికి సంబంధించిన ఫైలును అడగటం సరికాదని చెబుతున్నారు. పీతల సుజాత ఫైలు అడగటం పైన చర్చ సాగుతోందని తెలుస్తోంది.