ఆయన వల్లే ఇదంతా?: జగన్ బుజ్జగించినా!.. నేడే టీడీపీలో చేరనున్న ఈశ్వరి
Recommended Video
విశాఖపట్నం: అనుకున్నదే జరిగింది. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీ కండువా కప్పుకోవడానికి సన్నద్దమయ్యారు. ఆమెతో పాటు మరో 60 మంది ఎంపీటీలు, సర్పంచ్లను వెంటబెట్టుకుని టీడీపీలో చేరనున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సోమవారం ఆమె టీడీపీలో చేరనున్నారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం నియోజకవర్గం నుంచి 25 వాహనాల్లో అమరావతికి బయలుదేరారు. ఎమ్మెల్యే ఈశ్వరి, ఆమె గురువు గోవిందరావు తదితరులు మరో రెండు వాహనాల్లో బయలుదేరారు.
'దెబ్బకొట్టారు': ఈశ్వరి తలొగ్గుతారా?.. అదే జరిగితే జగన్కు దెబ్బే..
వైసీపీలో కష్టమనే:
విశాఖ ఏజెన్సీ ఏరియాలో గిడ్డి ఈశ్వరి బలమైన నేతగా ఉన్నారు. పదునైన మాట తీరుతో పలుమార్లు అధికార పక్షాన్ని కడిగిపారేశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్న మాట ఇప్పుడు గిడ్డి ఈశ్వరి విషయంలోను రుజువవుతోంది. గతాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు రాజకీయాల కోసం ఆమె టీడీపీలో చేరుతున్నారు. వైసీపీలో భవిష్యత్తు ఇరుకుగా అనిపించడం వల్లే ఆమె వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.
పెరగనున్న టీడీపీ బలం:
ఈశ్వరి చేరికతో టీడీపీ బలం మరింత పెరగనుంది. ముఖ్యంగా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఈశ్వరి కీలక నేతగా ఉన్నారు. ఆమె చేరికతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా టీడీపీ వైపు చూసే అవకాశం లేకపోలేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు టీడీపీకి అనుకూలంగా మారే సూచనలున్నాయి. గత ఎన్నికల్లో అరకు లోక్సభ, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.
అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇప్పటికే వైసీపీ దూరంగా ఉండగా, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గతేడాది టీడీపీలో చేరారు. అయితే ఈశ్వరి మాత్రం అవేవి పట్టించుకోకుండా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవలి పరిణామాలు ఆమెను పొమ్మనకుండా పొగపెట్టినట్టుగా ఉండటంతో ఆమె నొచ్చుకున్నారు. అందువల్లే వైసీపీని వీడటానికి నిర్ణయించుకున్నారు.
కోలుకోలేని దెబ్బ:
గిడ్డి ఈశ్వరి బలమైన గొంతు ఉన్న నేతగా వైసీపీలో పేరు తెచ్చుకున్నారు. ఒకవిధంగా ఆమె వల్లే ఏజెన్సీ ఏరియాలో వైసీపీకి పట్టు లభించింది. అలాంటి కీలక నేత విషయంలో వైసీపీ అనుసరించిన తప్పుడు విధానాల వల్లే ఆమె బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది.
ఈశ్వరికి తెలియకుండా కుంభా రవిబాబును అరకు వైసీపీ ఇంఛార్జ్గా నియమించడం ఆమెకు ఏమాత్రం రుచించలేదు. మాట మాత్రంగానైనా సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె తీవ్రంగా నొచ్చుకున్నారు. అంతేకాదు, తన ప్రాధాన్యతను తగ్గించడానికి ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కూడా ఆమెకు కలిగింది.
విజయసాయిరెడ్డి వల్లే:
ఉత్తరాంధ్ర వ్యవహారాలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. నేతలను కలుపుకుని పోవడంలో ఆయన విఫలమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. నేతలతో సమన్వయం లేకుండా తనకు తోచిన రీతిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి పూడ్చలేని డ్యామేజ్ జరుగుతోంది.
ఆఖరికి జగన్ రంగంలోకి దిగి ఈశ్వరితో ఫోన్ ద్వారా మంతనాలు జరిపినా సరే.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు.
ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్తులో తన ప్రాధాన్యాన్ని మరింత తగ్గిస్తారేమోనన్న ఆందోళన ఆమెలో మొదలైంది. అందుకే వైసీపీలో కొనసాగడం కంటే అధికార పార్టీలోకి వెళ్తే.. కనీసం నియోజకవర్గ అభివృద్ది అయినా సాధ్యపడుతుందని ఆమె భావిస్తున్నారు.