నిర్ణయం మార్చుకోని జగన్
Chandrababu: ఏపీ అసెంబ్లీ.. ఇంకాస్సేపట్లో సమావేశం కాబోతోంది. ఇవి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. మరో నాలుగు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి బడ్జెట్ ఇదే. ఇదివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగించిందీ సర్కార్.

బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి ఈ ఉదయం 9 గంటలకు మంత్రవర్గం సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులందరూ ఇందులో పాల్గొననున్నారు. ఈ ప్రతిపాదనలను యధాతథంగా ఆమోదించే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం 2.9 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక విద్య, వ్యవసాయం, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం సహా భారీ నీటి ప్రాజెక్టులు, రోడ్లు- ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండబోతోంది. ఈ సమావేశాలను బహిష్కరించాలని ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ సెషన్స్కు కూడా దూరంగా ఉండనుంది.
40 శాతం ఓట్లు ఉన్నప్పటికీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం, తమ పార్టీకి ప్రతిపక్షంగా గుర్తించకపోవడానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీకి వెళ్లకపోయినప్పటికీ ప్రతిరోజూ అధికార సంకీర్ణ కూటమి వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్వహించిన తొలి అసెంబ్లీ భేటీలో వైఎస్ జగన్ సహా, ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాతి సమావేశాన్ని బహిష్కరించారు. అదే విధానాన్ని బడ్జెట్ భేటీలోనూ విషయంలోనూ కొనసాగించనున్నారు.
అసెంబ్లీలో ఓ ప్రతిపక్ష పార్టీ ఎలాంటి పాత్రను పోషిస్తుందో.. అలాంటి పాత్రను జనం మధ్య నిర్వహిస్తామంటూ వైఎస్ జగన్ ఇదివరకే తేల్చి చెప్పారు. ప్రతిరోజూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులే తనకు స్పీకర్లుగా ఉంటారని నమ్ముతున్నట్లు జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications