కడప గడ్డపై నుంచి పురంధేశ్వరి తొలి సమరశంఖం: బీజేపీ చీఫ్ హోదాలో
కడప: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు పూనుకున్నారు. నియోజకవర్గాలు, జిల్లా స్థాయి నాయకులతో విస్తృత సమావేశాల్లో పాల్గొనబోతోన్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారామె.
ఇందులో భాగంగా ఆదివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పార్టీ రాయలసీమ జోనల్ స్థాయి నాయకులతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆమె చేపట్టిన తొలి జిల్లా పర్యటన ఇదే కావడం, అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సమావేశంలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. కడప, అన్నమయ్య రాయచోటి, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి పలువురు నాయకులు హాజరు కానున్నారు. రాయలసీమలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలు, అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు.. ఈ విస్తృతస్థాయి సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత పురంధేశ్వరి తొలిసారిగా జిల్లాకు రాబోతోన్న నేపథ్యంలో- నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
దీని తరువాత ఆమె గుంటూరులో పర్యటిస్తారు. కోస్తా జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ఈ నెల 25వ తేదీన ఏర్పాటయింది. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారు. 27వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులను కలుసుకుంటారు.












Click it and Unblock the Notifications