చంద్రబాబు నీటి పాఠం: కడప సాక్షిగా జగన్పై ఫైర్, ‘ఏం తమ్ముళ్లూ.. ఎక్కడైనా చేశారా..?’
కడప: రాయలసీమను సస్యశ్యామలం చేసేవరకు రాత్రింబవళ్లు కష్టపడతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరువళ్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీరు-ప్రగతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
నీరు లేకపోతే మానవ మనుగడ కష్టమని చెప్పిన చంద్రబాబు చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు అన్ని గ్రామాల్లో చేపట్టాలని కోరారు. పంటసంజీవని కింద ప్రతి ఒక్కరి పొలంలో పంటకుంటలు తవ్వాలని రైతులకు సూచించారు. దీని ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు.
నీరులేకపోతే మన మనుగడ లేదని నీరు-చెట్టు కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. కష్టపడకపోతే భవిష్యత్తులో సుఖం ఉండదని, నేడు నీటిని ఆదాచేసుకుంటే భవిష్యత్తులో దాని కొరత ఉండదని వ్యాఖ్యానించారు. భావితరాల భవిష్యత్తు కోసమే తాను పనిచేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. నీటిని పరిరక్షించే బాధ్యత ప్రతీఒక్కరూ తీసుకోవాలన్నారు. గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా చేస్తామన్నారు. ప్రతీ ఇంటికి వంటగ్యాస్ ఇస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద లక్షా యాబైవేలు అందిస్తున్నామన్నారు.
గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేసేలా చేశానన్నారు. 'మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం' తీసుకొచ్చానని చెప్పారు. దీని ద్వారా భవిష్యత్తులో పట్టాదారు పాసుపుస్తకం అవసరం లేదని చెప్పిన చంద్రబాబు, మీ భూమిని మీ ఫోన్ లోనే చూసుకునే వెసులుబాటు తీసుకొచ్చామన్నారు.
తద్వారా అవినీతి పూర్తిగా కంట్రోల్ అవుతుందన్నారు. తన మీద నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు 34వేల ఎకరాల భూమి ఇచ్చారని, వారి కలలు నెరవేర్చితీరుతానని అన్నారు. ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కడతామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాని కరువు రహితంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు విషయంలో రాజీపడబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాలు చెప్పినట్లు చేస్తే కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయినట్లు రాష్ట్రం పరిస్థితి తయారవుతుందన్నారు.
అంతక ముందు కడప జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్యానవన రైతులకు రుణమాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో రైతులతో చంద్రబాబు ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు రుణమాఫీ అంశంపై అనవసర విమర్శలు చేస్తున్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.20వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీనే అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 'ఏం తమ్ముళ్లూ.. ఏపీలో చేసినంత రుణమాఫీ దేశంలో ఎక్కడైనా చేశారా..?' అని ప్రశ్నించారు. 'స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో ఇంత భారీ మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా..?' అని మళ్లీ అడిగారు.
రాష్ట్ర విభజనతో ఏపీకి చాలా అన్యాయం జరిగిందని, ఇది మామూలు అన్యాయం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం చాలా తక్కువగా ఉన్నా తన పట్టుదలతో రైతులను ఆదుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 'వ్యవసాయాధికారులు మీ దగ్గరకు వస్తున్నారా? లేరా..?' అని చంద్రబాబు రైతులను ప్రశ్నించారు. 'వారు రాకపోతే చెప్పండి, వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తా'నని వ్యాఖ్యానించారు.
కాగా ఉద్యానవన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.384.47కోట్ల రుణమాఫీని ప్రకటించారు. ఈ రుణమాఫీ పథకం ద్వారా 2.23లక్షలమంది ఉద్యానవన రైతులు లబ్ది పొందనున్నారని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకే రుణమాఫీ పథకాన్ని ప్రవేవపెట్టినట్లు చెప్పారు.
రుణమాఫీపై విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప జిల్లాను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పులివెందులలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని చెప్పారు.
పండ్ల తోటల వల్ల రైతుకు మంచి ఆదాయం వస్తుందని, వ్యవసాయం చేసిన వారికంటే పండ్ల తోటలు వేసిన వారి ఆదాయం ఎక్కువ అని చెప్పారు. వ్యవసాయంతో పోలిస్తే ఉద్యాన పంటల్లో పన్నెండు రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయం చేసినా తక్కువ ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారని బాబు తెలిపారు.
భవిష్యత్లో చేపల పెంపకం ద్వారా అధిక ఆదాయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఉద్యాన పంటలు, డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం ద్వారా అధిక ఆదాయం వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యానవన రైతులకు రుణమాఫీ పత్రాలు అందజేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. దామాశా ప్రకారం ఏపీకి నీరు రావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పట్టిసీమను అడ్డుకునేందుకు యత్నించాయని తెలిపారు.












Click it and Unblock the Notifications