తొలగించిన చోటే వైఎస్ విగ్రహం.. టీడీపీ తొలగిస్తే, వైసీపీ పున:ప్రతిష్టించింది.
విజయవాడ : ప్రభుత్వాలు మారితే పథకాలు, పేర్ల మార్పు సహజమే. కొన్ని సార్లు విగ్రహాలను కూడా తీసి .. పక్కన పెట్టేశారు. దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించింది. దీనిపై అప్పటి ప్రతిపక్షం గగ్గొలు పెట్టిన పెడచెవిన పెట్టింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో సహజంగా జరిగే ప్రక్రియ జరిగింది.
విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద 2011లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వైఎస్ఆర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. అప్పటినుంచి విగ్రహం అక్కడే ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారం చేపట్టింది. దీంతో పుష్కరాల అభివృద్ధి పనుల సమయంలో అడ్డొస్తోందని వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చేలరేగింది. కానీ అప్పటి సర్కార్ పట్టించుకోలేదు. వైఎస్ విగ్రహాన్ని కంట్రోల్ రూం పక్కన ఉన్న అగ్నిమాపక కార్యాలయంలో ఉంచారు.
విజయవాడ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైయస్సార్ పార్కులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న సీయం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు. pic.twitter.com/YjGPRa96oV
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 2, 2019
ఇక అప్పటినుంచి వైఎస్ విగ్రహం అగ్నిమాపక కార్యాలయంలోనే ఉంచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జయభేరీ మోగించింది. ఇంకేముంది వైఎస్ విగ్రహా పున: ప్రతిష్టపై ఫోకస్ చేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ సీఎం జగన్ .. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.