స్థానికత క్లియర్: 'ఇక ఉద్యోగులు అమరావతికి వచ్చేయాలి'
విజయవాడ: స్థానికత అంశం పరిష్కారం కావడం సంతోషకరమని మంత్రి నారాయణ శుక్రవారం నాడు చెప్పారు. జూన్ 27వ తేదీ వరకు ఉద్యోగులు అమరావతికి రావాలని ఆయన సూచించారు. నవంబర్ 14వ తేదీ నాటికి భూ సేకరణ పూర్తి చేస్తామన్నారు.
అమరావతికి ఉద్యోగుల తరలింపులో మరో మలుపు: కేసీఆర్కు చిక్కు!
ఈ నెల 20వ తేదీన నుంచి రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. తాత్కాలికంగా నెల రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నట్లు నారాయణ వెల్లడించారు.
కంభంపాటి హర్షం
స్థానికత అంశంపై ప్రధాన అడ్డంకిని తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ దస్త్రాల పైన సంతకం చేయడం పట్ల ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ శుక్రవారం నాడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... ఇక ప్రభుత్వోగులు ఏపీకి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. ఏపీ ఉద్యోగులు ఇక అమరావతికి వచ్చేయాలని చెప్పారు. ఉద్యోగులు తమ పిల్లల స్థానికతపై ఆందోళన వద్దని సూచించారు. స్థానికతపై ఉద్యోగులకున్న సందేహాలకు గెజిట్ నోటిఫికేషన్ సమాధానంగా ఉంటుందన్నారు.