Anna Canteens: అన్న క్యాంటీన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! త్వరలో ప్రతీ చోట..!
ఏపీలో టీడీపీ బ్రాండ్ అన్న క్యాంటీన్లలో సేవల్ని మరింత మెరుగుపర్చేందుకు వీలుగా కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 200 అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో పలు చోట్ల ఆహార నాణ్యత, ఇతర నిర్వహణ అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం వీటిని సరిదిద్దే దిశగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లకు సలహా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఇవాళ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రాష్ట్ర స్ధాయిలో ఓ సలహా కమిటీ, అలాగే ప్రతీ క్యాంటీన్ కు ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, వారి బాథ్యతలు ఏ విధంగా ఉంటాయన్న అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వివరాలు ఇచ్చారు. త్వరలోనే ఈ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి.

ప్రతీ అన్న క్యాంటీన్ కమిటీకి ఛైర్మన్ గా మున్సిపల్ చైర్పర్సన్ లేదా కార్పొరేటర్ ఉంటారు. శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ వార్డు సెక్రటరీ, వార్డు ఉమెన్ వీకర్స్ సెక్షన్ సెక్రటరీ, స్థానిక ఎన్జీవో ప్రతినిధి, డ్వాక్రా గ్రూపుల ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు సంబంధిత అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ కన్వీనర్ గా ఉంటారు. ఈ కమిటీలు ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కఠిన పర్యవేక్షణ చేస్తాయి. అలాగే రతి భోజనానికి "డైలీ ఫుడ్ టేస్ట్ టెస్ట్" నమోదు చేస్తారు.

అలాగే ఈ కమిటీ అన్న క్యాంటీన్ ఆపరేషన్లపై రోజువారీ-వారపు రికార్డులు నిర్వహిస్తుంది. సీసీటీవీ, ఎఫ్ఆర్ఎస్ వంటి టెక్నాలజీ పరికరాల పరిశీలన కూడా చేస్తారు. లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరిస్తారు. సేవల్లో లోపాలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. కమ్యూనిటీ భాగస్వామ్యం, వాలంటీర్ల సమన్వయంతో ప్రభుత్వ ఆమోదిత వారపు మెనూ అమలును పరిశీలిస్తారు. అన్న క్యాంటీన్లు మరింత పారదర్శకంగా, ప్రజలకు మరింత దగ్గరగా పనిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications