ఆ రోజు వాళ్లు చెప్పినదాని ప్రకారం మన భవిష్యత్తు ఉంటుందా?
రాజధాని అమరావతికి సంబంధించిన అంతిమ తీర్పును సుప్రీంకోర్టు ఈనెల 23వ తేదీన వెలువరించబోతోంది.
AP రాజకీయాలు భిన్నమైన వైఖరులు కనపరుస్తున్నాయి. ఎప్పుడు ముందస్తు ఎన్నికల ప్రకటన వస్తుందోననే ఒత్తిడిలో రాజకీయ నేతలంతా ఉన్నారు. అకస్మాత్తుగా మీదపడే ముందస్తుకు సరైన సన్నాహాలు చేసుకోగలమా? లేదా? అనే సందేహంతో ఉన్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఈరోజో, రేపో ఎన్నికలు వస్తాయన్న భావనతో ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ముందస్తు ఎన్నికలొస్తే వాటిని ఎదుర్కోవడానికి తగిన సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు.

ఈనెల 23నే కీలక పరిణామం
ఏపీ రాజధానిగా అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు మూడున్నర సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసింది. గత నెల 31వ తేదీన ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ రాజధాని విశాఖపట్నమేనని, త్వరలోనే తాను కూడా షిఫ్ట్ అవుతున్నానంటూ సంచలన ప్రకటన చేశారు.
ఉగాది పండగ తర్వాత వైసీపీ రాజకీయాల్లోను, ప్రభుత్వ పరంగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయోననే ఉత్కంఠకు గురిచేస్తున్న ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ఈనెల 23వ తేదీన చోటుచేసుకోబోతోంది.

ప్రభుత్వం కోరడంతో 23వ తేదీకి
రాజధాని అమరావతికి సంబంధించిన అంతిమ తీర్పును సుప్రీంకోర్టు ఆరోజు వెల్లడించబోతోంది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది? లేదంటే హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి అక్కడే తేల్చుకోమంటుందా? అనే సందిగ్ధత కొనసాగుతోంది.
ప్రభుత్వం త్వరగా విచారణ జరపాలని కోరడంతో ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఏం చేయాలి? వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి? అనే కోణంలో వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఉగాదికి విశాఖ వెళ్లాలని..
మార్చి 22వ తేదీన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఉంటుంది. ఉగాదికి విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించాలనే యోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఉగాది తర్వాత తరలించే అవకాశం కనపడుతోంది.
అంతేకాకుండా ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రులు సమర్థవంతమైన పనితీరు కనపరచడంలేదనే అసంతృప్తి కూడా ముఖ్యమంత్రిని వెంటాడుతోందని, సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రివర్గ భవిష్యత్తు కూడా ఆధారపడివుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
తీర్పు అనుకూలంగా వస్తే పర్వాలేదుకానీ ప్రతికూలంగా వస్తే ఏం చేయాలనే విషయాన్ని తమ నేత ఆలోచించిపెట్టారని, తీర్పు వెలువడిన తర్వాత దాన్ని అమలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications