ఆలేరు ఎన్కౌంటర్పై డిగ్గీ సంచలనం, ఏపీ-తమిళనాడు మధ్య టెన్షన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లు విమర్శలకు దారి తీస్తున్నాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇరవై మంది ఎర్రచందనం స్మగర్లు, కూలీలను ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేయగా, నల్గొండ-వరంగల్ సరిహద్దుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులను తెలంగాణ పోలీసులు మట్టుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లు విమర్సలకు దారి తీస్తున్నాయి.
నల్గొండ ఎన్కౌంటర్పై దిగ్విజయ్
నల్గొండ జిల్లాలోని ఆలేరు సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ పైన సమగ్ర దర్యాఫ్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్ను ఆయన గుజరాత్ నకిలీ ఎన్కౌంటర్తో పోల్చారు. దీనిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
తమిళ సంఘాల ఆందోళన
శేషాచలం అడవుల్లోని ఎన్ కౌంటర్ పైన తమిళ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. తమిళనాడు, ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలలోని ఆంధ్రా సంస్థల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ - తమిళనాడులకు రాకపోకలు బంద్ అయ్యాయి. తమిళనాడు - ఆంధ్రా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉంది. తమిళులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ముందస్తుగా ఏపీఎస్సార్టీసీ ముందస్తుగా తమిళనాడుకు బస్సులను నిలిపివేసింది.
రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద బుధవారం ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఇరవై మంది కూలీలను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని పౌర హక్కుల సంఘాల నేతలు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. రుయా ఆసుపత్రిలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.