ఏపీలో కరోనా దెబ్బకు వాలంటీర్లు దూరం- 3200 మంది భర్తీకి ఏర్పాట్లు...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం వాలంటీర్లపై తీవ్రంగా పడింది. కరోనా వైరస్ రోగులను గుర్తించేందుకు ప్రభుత్వం వీరిని నేరుగా రంగంలోకి దింపడం, మూడు సర్వేలు నిర్వహించడం వంటి కారణాలతో వేల సంఖ్యలో వాలంటీర్లు విధులకు దూరమయ్యారు. దీంతో వీరి స్ధానంలో కొత్త వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ప్రక్రియ ఆరంభం కానుంది.
ఏపీలో కరోనా ప్రభావం- వాలంటీర్లు విలవిల..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పలువురు వాలంటీర్లు.. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఉద్యోగాలు వదులుకునేందుకు సిద్ధమయ్యారు. 13 జిల్లాల్లో పనిచేసిన వేలాది మంది వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం కరోనా సర్వేలు నిర్వహించడంతో వీరిలో పలువురికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. నేరుగా క్షేత్రస్ధాయిలో విధులు నిర్వర్తించాల్సి రావడం, కరోనా రోగులను నేరుగా కలవాల్సి రావడంతో చాలా చోట్ల వాలంటీర్లు విధుల్లోకి రావడం మానేశారు. కొన్ని చోట్ల అధికారులు నచ్చజెప్పి విధుల్లోకి రప్పిస్తుండగా... మరికొన్ని చోట్ల ఈ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. దీంతో వీరి స్దానంలో కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

3259 వాలంటీర్ల ఖాళీల భర్తీ..
కరోనా సమయంలో ఏపీలో పనిచేస్తున్న లక్షలాది మంది వాలంటీర్లపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడంతో వీరు ఉద్యోగాలకు దూరమయ్యారు. మరికొందరిని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో అధికారులే తప్పించారు. వీరి మొత్తం సంఖ్య 3259 మందిగా తేలింది. దీంతో గ్రామ, వార్డు వాలంటీర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి త్వరలో వీరి ఎంపిక పూర్తి చేయనున్నారు.












Click it and Unblock the Notifications