పయ్యావుల కేశవ్ ఆన్ ఫైర్: నేరుగా బుగ్గన శాఖ ముఖ్య కార్యదర్శికి: ఆ అయిదు అంశాలపై
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కేంద్రబిందువుగా చేసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సరికొత్త రాజకీయానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలకు బిల్లులు లేవంటూ ఆయన ఇటీవలే బాంబు పేల్చారు. దీనికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు. తప్పుడు ఆరోపణలతో ఉపయోగం ఉండబోదంటూ చురకలు అంటించారు. 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలున్నాయని స్పష్టం చేశారు.
బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనడంలో అర్థం లేదంటూ ఎదురుదాడికి దిగారు. ప్రజా పద్దుల కమిటీ అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలకు తాము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని బుగ్గన స్పష్టం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే- పయ్యావుల కేశవ్ నేరుగా బుగ్గన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. అయిదు అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు అందజేయాల్సిందిగా సూచించారు.

బుగ్గన ఇచ్చిన హామీ మేరకు తాము సమగ్ర సమాచారాన్ని కోరుతున్నామని అన్నారు. ఏపీ అభివృద్ధి సంస్థ వివిధ బ్యాంకుల నుంచి రుణాలను ఏవైనా తీసుకున్నట్టయితే.. దానికి సంబంధించిన సమగ్ర వివరాలను ప్రజా పద్దుల కమిటీకి అందజేయాలని సూచించారు. ఏఏ బ్యాంకుల నుంచి ఎంతమేర రుణాలను తీసుకున్నారనేది తెలియజేయాలని అన్నారు. ఆయా బ్యాంకుల నుంచి రుణాలను పొందడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులతో కుదర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను అందజేయాలని సూచించారు.
Recommended Video
దీనితోపాటు- ఆ రుణాలను పొందడానికి ఏపీ అభివృద్ధి సంస్థ తరఫున బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ పత్రాలను కూడా జత చేయాలని అన్నారు. ఈ రుణాలను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు వివరాలను రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. రాష్ట్ర శాసనసభకు తెలియపరిచిన పత్రాలను కూడా తమకు అందజేయాలని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇచ్చిన హామీ మేరకు ఆ సమాచారం మొత్తాన్నీ తమకు పంపించాలని కోరారు.












Click it and Unblock the Notifications