ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్: రేపే ప్యాకేజీకి చట్టబద్దత!..
గత రెండు రోజులుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ అధికారులతో మంతనాలు జరుపుతున్న సుజనా చౌదరి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాల్సిందిగా వారికి విన్నవించారు.
విజయవాడ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని సహా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం గతంలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కావాలని ఏపీ జనం కాంక్షించినా.. అది ఇప్పట్లో సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు కొంతలో కొంత ఊరట కలిగించేలా.. ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీకి కేంద్రం చట్టబద్దత కల్పించనుంది. ఈ మేరకు బుధవారం నాడు నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.
కాగా, సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు కేంద్రమంత్రి సుజనాచౌదరి ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గత రెండు రోజులుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ అధికారులతో మంతనాలు జరుపుతున్న ఆయన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాల్సిందిగా వారికి విన్నవించారు.
సీఎం ఆదేశాల మేరకు ప్యాకేజీ చట్టబద్దతలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు సుజనాచౌదరి ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీతో పాటు పలు అంశాలను కూడా కేబినెట్ అజెండాలో చేర్చే అవకాశం కనిపిస్తోంది.