ఎపి, తెలంగాణ: తొలి ముఖ్యమంత్రులు ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును చెప్పుకుంటున్నాం. అలాగే, ఆంద్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చెప్పుకుంటున్నాం. అయితే, అది వాస్తవమైనా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
1956 నవంబర్ 1వ తేదీకి ముందు రెండు ప్రాంతాలు వేర్వేరు రాష్ట్రాలుగా ఉండేవి. మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దానికి కర్నూలు రాజధానిగా ఉండేది. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిజాం పాలన నుంచి విముక్తమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాదు తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు. ప్రస్తుతం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు ఆ రెండు రాష్ట్రాల భౌగోళిక స్థితిగతులు భిన్నంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ అవతరణతో కొన్ని ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. హైదరాబాద్ రాష్ట్రం 1948 నుంచి 1956 వరకు మనుగడలో ఉంది. 1948లో హైదరాబాద్ ఏర్పడినప్పటికీ 1952 వరకు ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రి రాలేదు. ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ ఔరంగాబాద్, గుల్బర్గా వంటి డివిజన్లు రాష్ట్రాల పునర్వ్యస్థీకరణలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి.
1953 అక్టోబర్ 1వ తేదీన 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే తొలి భాషాప్రయుక్తర రాష్ట్రం. మొత్తం మీద 1956లో నవంబర్ 1వ తేదీన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గానే పిలుస్తున్నారు. దానికి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.












Click it and Unblock the Notifications