అసెంబ్లీ సెన్సార్!: నిన్న రేవంత్పై కేసీఆర్, నేడు రోజాపై బాబుకు చిక్కు
హైదరాబాద్: నిన్న తెలంగాణ రాష్ట్రం... నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో దూషణ పర్వం రచ్చగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ వీడియోల విడుదలలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ కాల్వ శ్రీనివాసులు మధ్యాహ్నం శాసన సభకు చెందిన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
శాసన సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన అసభ్యంగా ఉందని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యల పైన తాము విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. రోజా పైన చర్యలుతీసుకోవాలని తాము స్పీకర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు.
శాసన సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా రోజా మాట్లాడారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసభ్యపదజాలంతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నారన్నారు. సభలో ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయన్నారు. వాటిని గుర్తించి నడవాలన్నారు.
అయితే, టీడీపీ విడుదల చేసిన వీడియో పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ వీడియో ఏకపక్షంగా ఉందని విమర్శిస్తున్నారు. కేవలం తమకు సంబంధించిన వీడియోనే విడుదల చేశారని, అధికార పార్టీకి చెందిన వీడియో ఏదని ఎమ్మెల్యే రోజా తదితరులు ప్రశ్నించారు.

ఎమ్మెల్యే బొండా ఉమ, అచ్చెన్నాయుడు తదితరులు తమ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడినా దానిని పట్టించుకోలేదని, కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వీడియోను మాత్రమే విడుదల చేయడంలో అర్థమేమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది. దమ్ముంటే పూర్తి వీడియోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.
అయితే, సభ విషయంలో తప్పును తమ పైన నెట్టే ప్రయత్నం వైసీపీ చేసిందని, అందుకే ఆ పార్టీకి చెందిన వీడియోను విడుదల చేశామని టీడీపీ చెబుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యల పైన టీడీపీ నేత కాల్వ పశ్చాత్తాపం ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ శాసన సభలో తీవ్ర వాగ్వాదం, తిట్ల వర్షం వినిపించిన విషయం తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలోను ఇదే తరహా కనిపించింది. జాతీయ గీతాన్ని అవమానించారంటూ టీడీపీ సభ్యులను అధికార తెరాస వారిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు బహిష్కరించింది. దీని పైన టీడీపీ సభ్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను అఖిల పక్ష సభ్యులు చూశారు. అయితే, ఈ వీడియోను సెన్సార్ చేశారని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. విపక్షాలదే తప్పుగా చెప్పే విధంగా వీడియో ఉందని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎల్పీ జానా రెడ్డి కూడా అధికార తెరాస విడుదల చేసిన వీడియోను తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications