బాబు దీక్ష: ఎపి భవన్లో ఉద్రిక్తం, టిడిపి నేతలకు నో ఫుడ్!
న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని ఎపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపేందుకు ఆ పార్టీ శ్రేణులకు ఎపి భవన్ ఉద్యోగులు అనుమతి నిరాకరించారు. దీంతో బుధవారం ఉదయం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తమను లోనికి అనుమతించక పోవడంతో ఎంపి సిఎం రమేష్, ఇతర టిడిపి నేతలు గేటు వద్ద ఆందోళనకు దిగారు. తెలుగుజాతి గౌరవాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. టిడిపి శ్రేణులకు, ఇతర నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు తమను లోనికి అనుమతించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, దీక్షకు అనుమతి లేదని, తక్షణం భవన్ ప్రాంగణాన్ని వీడి బయటకు వెళ్లాలంటూ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఉదయం మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్లో సిఎస్ను కలిసి ఎపి భవన్లో దీక్ష చేసేందుకు అనుమతి కావాలంటూ దరఖాస్తు చేశామని, అలాంటిది ఇప్పుడు దీక్షకు అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వటం ఏమిటని టిడిపి నాయకులు ప్రశ్నించారు.
గోయల్ బయటకు వెళ్లిపోవాలంటూ మళ్లీ సాయంత్రం మరోసారి సూచించారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఈ దృష్ట్యా ఏ ప్రభుత్వ భవనంలో రాజకీయ కార్యకలాపాలు జరగరాదని, సమావేశాలు పెట్టరాదని, కాబట్టి వెళ్లాలని ఆదేశించారు. దీంతో అధికారులపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీలు కొనకళ్ల నారాయణ, సుజనా చౌదరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు గోయల్ నివాసానికి వెళ్లారు. ఢిల్లీ ఎన్నికలకు ఎపి భవన్కు సంబంధం లేదని, తమ దీక్ష ఎన్నికలకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఎపి భవన్కు వర్తించదని స్పష్టం చేశారు. కమిషనర్, ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని, ఇది సరికాదని మండిపడ్డారు.
బాబును కలిసి మద్దతు తెలిపేందుకు వస్తున్న వారి కోసం టిడిపి ఏర్పాటు చేసిన భోజన సదుపాయాన్ని కట్ చేయాలని, ఆ పార్టీ నాయకులకు భోజనం పెట్టొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎంపీలు - కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాబు దీక్ష నేపథ్యంలో చాలామంది టిడిపి నాయకులు భోజనాలు మానేశారని, దూర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరికి మాత్రమే భోజన సదుపాయం ఏర్పాటు చేశామని కొనకళ్ల తెలిపారు.












Click it and Unblock the Notifications