వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై అదే చివరిరోజు: అప్పుడు రవ్వంత..ఇప్పుడు కొండంత: రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటీషన్పై వాదనలను సంబంధించిన వివరాలను వెల్లడించారు. సొంత పార్టీకే చెందిన కొందరు ఎంపీల తీరును తప్పుపట్టారు.

ఇదే ఫైనల్ అనుకున్నాం గానీ..
వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్పై ఇవ్వాళే సీబీఐ న్యాయస్థానం తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని భావించానని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సీబీఐ 8వ తేదీన రాతపూరకంగా ఎలాంటి సబ్మిషన్ ఇవ్వలేదని, ఈ విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తెలిపిందని వివరించారు. తాజాగా సీబీఐ అధికారులు మళ్లీ కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుందని, దాని కోసం 10 రోజుల పాటు గడువు కావాలని న్యాయస్థానానికి రాతపూరకంగా విజ్ఞప్తి చేశారని రఘురామ తెలిపారు. సీబీఐ వాదనలను తన న్యాయవాది వెంకటేష్ విభేదించారని, గడువును ఇవ్వడం అంగీకారం కాదని స్పష్టం చేసినట్లు చెప్పారు.

ఈ నెల 26వ తేదీ నాటికి..
సీబీఐ అధికారులు కోరిన విధంగా న్యాయస్థానం 10 రోజుల గడువు ఇచ్చిందని రఘురామ తెలిపారు. ఈ నెల 26వ తేదీన మరోసారి విచారణ ఉంటుందని చెప్పారు. ఆ విచారణే ఆఖరిది అవుతుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదొక మంచి పరిణామం అని వ్యాఖ్యానించారు. కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు చెప్పడాన్ని స్వాగతించదగ్గదని అన్నారు. బెయిల్ మంజూరు చేయడానికి తాము వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారని చెప్పారు. 2018లో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే సీబీఐ స్పందించిందని అన్నారు.

అప్పట్లో రవ్వంతగా ఉన్నది.. ఇప్పుడు కొండంత
అప్పట్లో రవ్వంతగా ఉన్నది.. ఇప్పుడు కొండంత అయిందని చెప్పుకొచ్చారు. అయినా సీబీఐ స్పందించదనే అనుమానం తనకు లేదని రఘురామ అన్నారు. 26వ తేదీ నాడు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేసినా, చేయకపోయినా అదే చివరిరోజు అవుతుందని పునరుద్ఘాటించారు వైఎస్ జగన్ బెయిల్ రద్దు విషయంలో న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాని అన్నారు. 26వ తేదీ చాలా ప్రాధాన్యత ఉన్న రోజుగా పేర్కొన్నారు.

పార్లమెంట్లో స్తంభన విద్య..
స్పీకర్ కార్యాలయం నిర్ణయాలను తమ పార్టీ నాయకులే తీసుకుంటోన్నారని రఘురామ విమర్శించారు. తమ పార్టీ సభ్యులు పార్లమెంట్లో స్తంభన విద్యను ప్రదర్శిస్తామని చెప్పడం హాస్యాస్పదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిధులపై పార్లమెంట్ను ఇప్పటిదాకా స్తంభింపజేయలేదని, అలాంటిది తన విషయంలో ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయమని అడిగిన వెంటనే స్పీకర్ చర్యలు తీసుకోవాలా? తన విషయంలో జాప్యం జరగాలా? అని ప్రశ్నించారు. తాను కొంత ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గానికి వెళ్లట్లేదని చెప్పారు.
Recommended Video

వర్చువల్ భేటీకి అవకాశం..
తన తోటి ఎంపీ మార్గాని భరత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు దోచారని, అందుకే ఆయనకు తన నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగించినట్లు ఆయన ప్రచారం చేసుకుంటోన్నారని ఎద్దేవా చేశారు. తాను పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తనని, గురువారం నిర్వహించ తలపెట్టిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించాల్సిన బాధ్యత చీఫ్పై ఉందని అన్నారు. వర్చువల్గా, వీడియో కాన్ఫరెన్స్లో ఈ భేటీలో పాల్గొనే అవకాశం కల్పించాలని తాను ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications