రెడ్డి ఓట్లే టార్గెట్ గా... 'వీరసింహారెడ్డి'?
యువరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న107వ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేరు పెట్టడంపై పెద్ద కసరత్తే జరిగింది. షూటింగ్ జరుపుకునే సమయంలో 'NBK-107'పేరును వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. దీపావళి సందర్భంగా అభిమానుల కోసం సినిమా పేరును విడుదల చేశారు. 'వీరసింహారెడ్డి' అనే పేరు ఖరారు చేసి క్యాప్షన్ గా గాడ్ ఆఫ్ మాసెస్ అని పెట్టారు.

ఎడతెగని చర్చల అనంతరం 'వీరసింహారెడ్డి'
చిత్రీకరణ ప్రారంభంలో అన్నగారు, రెడ్డిగారు, పెద్దాయన, వీరసింహారెడ్డి పేర్లు అనుకున్నారు. కొద్దికాలానికి 'రెడ్డిగారు' అన్న పేరు మరీ సాఫ్ట్ గా ఉండటంతో దాన్ని తొలగించి ఫైనల్ గా మూడు పేర్లు ఉంచారు. ఎడతెగని చర్చ అనంతరం 'వీరసింహారెడ్డి'కి ఓటు పడింది. నిర్మాతలు 'అన్నగారు' టైటిల్ పెడదామనుకున్నప్పటికీ దానిపై బాలకృష్ణ ''అన్నగారు అంటే నాన్నగారే గుర్తుకువస్తారని, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ పేరు ఎన్టీఆర్ కు సొంతమని'' కాబట్టి అది వద్దని చెప్పారు. తర్వాత 'పెద్దాయన' అనుకోగా ''ఆ పేరు వినగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డే గుర్తుకు వస్తారని'' అది కూడా వద్దన్నారు. 'సింహం' ఎలాగూ తనకు కలిసొస్తుందని, అంతేకాకుండా సినిమాలో పాత్రపేరు కూడా అదే కాబట్టి 'వీరసింహారెడ్డి'ని బాలయ్య ఫైనల్ చేశారు.

బాలయ్యకు సీమ అభిమానులు ప్రత్యేకం
బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నప్పటికీ రాయలసీమలోని అభిమానులు ప్రత్యేకం. సమరసింహారెడ్డి సినిమా సమయంలో పేరు చివర 'రెడ్డి' అనే పదాన్ని ఉపయోగించడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత చేసిన 'చెన్నకేశవరెడ్డి', 'సీమ సింహం'తోపాటు పలు సినిమాల్లో బాలకృష్ణ పాత్రల పేర్లు చివర 'రెడ్డి' ఉండటం సర్వసాధారణమైంది. ఏపీకి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమరసింహారెడ్డి విడుదల సమయంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడిగా పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి. అవన్నీ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. రాయలసీమలోని అన్ని మతాలవారు, కులాలవారు బాలకృష్ణను తమ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. అతని సినిమాలు కూడా సీమలోనే సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు పైబడి థియేటర్లలో ఆడుతుంటాయి.

రెడ్డి కులస్తులను టీడీపీకి మళ్లించేలా..
ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్డి కులస్తులు ఎక్కువ సంఖ్యలో వైసీపీకి కొమ్ముకాస్తుంటారు. పార్టీలు వేరైనప్పటికీ ఈ కులస్తులు బాలకృష్ణను ప్రత్యేకంగా అభిమానిస్తారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో.. రెడ్డి కులస్తుల ఓట్లను టీడీపీవైపు మళ్లించడం కూడా అంతే ముఖ్యం. ఈ తరుణంలో సినిమాపేరు కూడా కలిసొస్తుందనే ఉద్దేశం బాలయ్యలో ఉందని, తెలుగుదేశం పార్టీద్వారానే వారికి ఎక్కువ న్యాయం జరగిందని తెలియజెప్పడం కూడా బాలకృష్ణ ఉద్దేశం కావచ్చని సీనియర్ రాజకీయవేత్తలు, సినీ విమర్శకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications