మోడీని నేను ఏమీ అనలేదు, బాధపడుతున్నా: బాలకృష్ణ, కాస్టింగ్ కౌచ్పై ఇలా
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో హిందూపురం శాసన సభ్యుడు, నటుడు బాలకృష్ణ ఆదివారం స్పందించారు. హోదా అంశంలో కేంద్రం తీరుపై తెలుగు ప్రజల ఆవేదనను ధర్మపోరాట దీక్షలో తెలియజేశానని చెప్పారు. జైసింహ సినిమా శతదినోత్సవ వేడుక కోసం చిలకలూరిపేటకు వచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ప్రధాని మోడీ గురించి ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. మోడీ గురించి అప్రస్వామికంగా తాను మాట్లాడినట్లు బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడం తనను బాధించిందన్నారు. తాను వాడకూడని పదాలు, భాషను ఉపయోగించలేదన్నారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని నిర్మాణం కోసం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు.
కానీ వాటిని కేంద్రం పట్టించుకోకపోవడంపై తెలుగు ప్రజల ఆక్రందనను తన ప్రసంగంలో తెలిపానన్నారు. సీఎం చంద్రబాబు పలుమార్లు హోదా అంశంలో డెడ్లైన్ ఇచ్చినప్పటికీ కేంద్రం విస్మరించిందన్నారు. కేంద్రం సహకారం ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉండేదన్నారు.
శ్రీరెడ్డి ఇష్యూ నేపథ్యంలో సినీ పరిశ్రమలో చెలరేగుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదంపై కూడా బాలకృష్ణ స్పందించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న ఘటనలపై అందరూ ఒకే తాటిపై రావడం సంతోషమన్నారు.
అమిత్ షా వ్యాఖ్యల మాటేమిటి?
బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తాము చేస్తున్న ఎదురుదాడిని పునఃసమీక్షించుకోవాలని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అమిత్ షా విపక్షాలను జంతువులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యల మాటేమిటిన్నారు. జగన్ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తున్నారని, గాడ్సేతో పోలుస్తున్నారని, సీఎం దీక్షపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తిరుపతి బహిరంగ సభ తీవ్రతను తగ్గించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. హోదా ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీతో కలిసి నాటకాలు ఆడుతున్నారని, కేంద్రంతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేసుల భయంతో కేంద్రాన్ని, మోడీని నిలదీయలేకపోతున్నారని చెప్పారు. కేంద్రంతో జగన్ మంతనాలు జరిపి గాలి బ్యాచ్కు కర్ణాటకలో టిక్కెట్లు ఇప్పించారన్నారు.