జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ-కేంద్రం షాక్ నుంచి కోలుకునే లోపే-నో చెప్పిన బ్యాంకర్లు
ఏపీలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ కు కేంద్రం తాజాగా ఓ షాకిచ్చింది. ఇన్నేళ్లుగా సాగిపోతున్న నిధుల మళ్లింపు వ్యవహారానికి గండికొడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఇందులో నుంచి కోలుకునే లోపే బ్యాంకర్లు మరో షాకిచ్చారు. ఇప్పటివరకూ ప్రభుత్వం చెప్పినట్లల్లా ఆడుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్న బ్యాంకర్లు కాస్తా ఇప్పుడు ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ అసలు జరిగిందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివి తీరాల్సిందే...
అప్పుల ఊబిలో సర్కార్
ఏపీలో 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అప్పుల భారం నానాటికీ పెరుగుతూ పోతోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు అప్పటి టీడీపీ సర్కార్ మొదలుపెట్టిన భారీ అప్పుల వ్యవహారం ఇప్పుడు తడిసి మోపెడవుతోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుల భారం తగ్గకపోగా పెరుగుతూ పోతుండటంతో రాష్ట్రం నానాటికీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయానికీ, తీసుకుంటున్న అప్పులకీ పొంతనలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకర్లు, ఆర్ధిక సంస్ధలతో పాటు బహిరంగ మార్కెట్లో అప్పులిచ్చే వారూ కరువవుతున్నారు.
జగన్ సర్కార్ కు కేంద్రం షాక్
అప్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న జగన్ సర్కార్ కు తాజాగా కేంద్రం భారీ షాకిచ్చింది. ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం కేటాయిస్తున్న మొత్తాల్ని దారి మళ్లించి సొంత పథకాలకు వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఝలక్ ఇచ్చింది. ఇకపై కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చే మొత్తాల్ని దారి మళ్లించడం కుదరదని తేల్చిచెప్పేసింది. అంతే కాదు వీటిని ఎలా ఖర్చు చేయాలో కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో అప్పటివరకూ ఈ పథకాల మొత్తాల్ని తమ అవసరాలకు వాడుకుంటున్న ప్రభుత్వం సడన్ గా ఇరుకునపడింది. కేంద్ర ప్రాయోజిత పథకాల మొత్తాల మళ్లింపు కుదరకపోవడంతో కొత్త దారుల్ని వెతికే పనిలో పడింది.
రూటు మార్చిన జగన్
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని మళ్లించడం సాధ్యం కాదని తేలిపోవడంతో జగన్ సర్కార్ రూటు మార్చింది. బ్యాంకులకు చేరుతున్న కేంద్ర పథకాల నిధుల్ని ష్యూరిటీగా ఉంచి బ్యాంకర్ల నుంచి అప్పులు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు ఇదే ప్రయత్నం చేసిన ప్రభుత్వం తాజాగా మరోసారి బ్యాంకర్లను కేంద్ర ప్రాయోజిత పథకాల మొత్తాల్ని సెక్యూరిటీగా ఉంచి అప్పులు ఇమ్మని అడిగింది. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు ఆగిపోవడంతో నిలిచిపోయిన నిధుల్ని కొంతమేరకైనా కవర్ చేసుకోవాలని భావించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ప్రతిపాదనకు కూడా పంపింది. కానీ బ్యాంకర్లు మాత్రం ఈ ప్రతిపాదనపై భిన్నంగా స్పందించాయి.
కేంద్రం బాటలోనే బ్యాంకర్లు
తమ బ్యాంకుల్లో పడుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి వాడుకునేందుకు ఇప్పటివరకూ అనుమతిస్తున్న బ్యాంకర్లకు తాజాగా కేంద్రం పంపిన మార్గదర్శకాలు షాకిచ్చాయి. కేంద్ర పథకాల నిధుల మళ్లింపు కుదరదని కేంద్రం, ఆర్బీఐ తేల్చిచెప్పేయడంతో ఇక వాటి మళ్లింపు సాధ్యం కాదని ప్రభుత్వానికి తేల్చిచెప్పేశాయి. అదే సమయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని ష్యూరిటీగా ఉంచుకుని తమకు అప్పులు ఇమ్మని జగన్ సర్కార్ చేసిన ప్రతిపాదననూ బ్యాంకర్లు నిర్ద్వందంగా తిరస్కరించారు. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ వాడుకోవడం కుదరదని స్పష్టం చేశాయి.
జగన్ సర్కార్ కు బ్యాంకర్ల ఝలక్
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు సాధ్యం కాదని తేలిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డ జగన్ సర్కార్ కు బ్యాంకులు కూడా షాకిచ్చాయి. కేంద్ర పథకాల నిధుల్ని ష్యూరిటీగా పెట్టుకుని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కనీసం ఓడీ అయినా ఇమ్మని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా దానికీ నో చెప్పేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకూ ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతున్నాయని విమర్శలు ఎదుర్కొంటున్న బ్యాంకర్లు.. ఇప్పుడు జగన్ సర్కార్ కు హ్యాండ్ ఇచ్చేసినట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకుంటున్న ప్రభుత్వానికి అటు ఆ నిధులూ రాక, కొత్తగా అప్పులూ, ఓవర్ డ్రాఫ్ట్ పుట్టని పరిస్ధితులు దాపురించాయి.
Recommended Video
మూసుకుపోతున్న దారులు
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా ఇవ్వాల్సిన నిధుల్ని ఆలస్యం చేస్తోంది. అదే సమయంలో రుణ పరిమితిని దాటి అప్పులు తీసుకునేందుకు అనుమతించడం లేదు. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని తమ అవసరాలకు తాత్కాలికంగా అయినా మళ్లించి వాడుకునేందుకు వీల్లేకుండా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇప్పటికే బ్యాంకర్ల వద్ద అప్పుల చిట్టా పెరిగిపోయింది. అదే సమయంలో కేంద్ర పథకాల నిధుల ఆధారంగా కొత్త అప్పులు ఇచ్చేందుకూ బ్యాంకర్లు నిరాకరిస్తున్నాయి. కనీసం ఓవర్ డ్రాఫ్ట్ ఇమ్మన్నా బ్యాంకులు కనికరించడం లేదు. దీంతో జగన్ సర్కార్ కు ఎటు చూసినా చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పులు తెచ్చేందుకు అన్ని దారులూ మూసుకుపోతుండటంతో జగన్ సర్కార్ కు ఎటూ పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కరుణిస్తే తప్ప భవిష్యత్తులో కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఇప్పటికే వైసీపీ సర్కార్ కేంద్రంతో సంబంధాల విషయంలో పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్ధితి కొనసాగితే కేంద్రం వద్ద కాళ్ల బేరానికి వెళ్లక తప్పని పరిస్ధితి. దీంతో వైసీపీ సర్కార్ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.