టీడీపీపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు: 'మాణిక్యాలరావు వెనుక జగన్!'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. జగన్ లాలూచీ వ్యవహారంతోనే మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతున్నారన్నారు.
Recommended Video
జగన్! సవాల్ చేశావుగా, మోడీపై దమ్ముందా, నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్
మిత్రపక్షం అయినప్పటికీ బీజేపీపై పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సరైన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాజీనామాల పేరుతో జగన్ మూడేళ్లుగా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
జగన్ ఎవరి పంచన అయినా చేరుతారు
తన పైన ఉన్న కేసుల మాఫీ కోసం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పంచన అయినా చేరిపోతారని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. రెండేళ్ళ క్రితమే ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారని, అప్పటి నుంచి ఎందుకు మౌనంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు
కాగా, మంత్రి మాణిక్యాల రావు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీతో పొత్తును తాము తెంచుకునే పరిస్థితుల్లో లేమని చెబుతూనే, టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో టీడీపీ పొత్తు వీగిపోతే తమకు పోతే వెంట్రుకేనని, వారికి (టీడీపీ)కి మాత్రం బోడిగుండే అన్నారు.
టీడీపీతో తెగతెంపులు లేవంటూనే
బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రం మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని అధిష్ఠానానికి చెప్పినట్లు మాణిక్యాల రావు తెలిపారు. పొత్తు కొనసాగుతుందని అనుకుంటే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తీసుకువచ్చి రాష్ట్రంలో ఓ సభ పెట్టించి కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పిద్దామన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోమిరెడ్డి ఆగ్రహం
వివిధ రాష్ట్రాల్లో బీజేపీతో పలు పార్టీలు పొత్తును తెంచుకున్నాయని, ఇప్పుడు టీడీపీతో తెంచుకునే పరిస్థితి లేదని మాణిక్యాల రావు అన్నారు. రాజీనామాలకు సంబంధించి బీజేపీ అధిష్ఠానం ఏం చెబితే అదే తుది నిర్ణయమని తెలిపారు. ఒకరు పొత్తు వదులుకుంటే మరొకరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వెంట్రుకను బండరాయితో ముడివేశామని, వస్తే బండరాయి వస్తుందని, లేకుంటే వెంట్రుక పోతుందని, వారికి మాత్రం బోడిగుండు అవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై దీనిపై సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.
సొంత వ్యవహారం కాదు
ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, కేంద్ర బడ్జెట్లో అన్యాయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. విభజన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదాను అటకెక్కించి ప్యాకేజీ అన్నారని అయితే ప్యాకేజీ కూడా అమలు కాలేదన్నారు. ఏపీ అభివృద్ధి టీడీపీ, బీజేపీ సొంత వ్యవహారం కాదన్నారు.