నాకే సలహాలిస్తారా!: బాబు కాదా.. జగన్ తీరు వల్లే సైకిల్ ఎక్కుతున్నారా?
విజయవాడ: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ఆపరేషన్ ఆకర్ష్కు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పడ్డారు. టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గ అభివృద్ధి, చంద్రబాబు అభివృద్ధి చూసి చేరుతున్నామని చెబుతున్నారు.
అయితే, వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లనే వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఒంటెత్తు పోకడలు, ఆయన వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లనే భూమా నాగిరెడ్డి వంటి వారు సైకిల్ ఎక్కారనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ సొంత ఇలాకా కడపతో పాటు కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, కృష్ణా జిల్లా నుంచి జలీల్ ఖాన్, ప్రకాశం జిల్లా నుంచి డేవిడ్ రాజు సైకిల్ ఎక్కారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కలమట వెంకటరమణమూర్తి టిడిపిలో చేరనున్నారు.

తాము తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టిడిపిలో చేరుతున్నామని, అలాగే చంద్రబాబు అభివృద్ధి పైన దృష్టి పెట్టి నిరంతరం శ్రమిస్తున్నారని అందుకే తాము సైకిల్ ఎక్కుతున్నట్లు వారు చెబుతున్నారు. కానీ జగన్ వైఖరి పార్టీ ఫిరాయింపులకు కారణంగా తెలుస్తోంది.
ఏ జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యే జగన్కు ఎప్పుడు షాకిస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు జగనే కారణమని వార్తలు వస్తున్నాయి.
నిన్న వైసిపి ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కొందరు ఎమ్మెల్యేలు సూచనలు ఇవ్వగా... నాకే సలహాలిస్తారా, టైమ్ దొరికిందని ఇలా అంటారా అని జగన్ కస్సుమన్నారని, ఎమ్మెల్యేలతో సమావేశం అర్ధాంతరంగా ముగిసిందని పత్రికలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను వైసిపి ఎమ్మెల్యేలు కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications