ఏ బ్లాక్ను చంద్రబాబు కట్టించారో.. అదే బ్లాక్లో కట్టి పడేశారు: భువనేశ్వరి
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు.

ఈ సాయంత్రం చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ములాఖత్ సమయంలో భేటీ అయ్యారు. భార్య భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి.. చంద్రబాబును కలుసుకున్నారు. ఈ ములాఖత్ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనాన్ని అందించారు.
ములాఖత్ ముగిసిన అనంతరం భువనేశ్వరి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు కేటాయించిన బ్లాక్ను గతంలో ఆయన ప్రభుత్వంలోనే నిర్మించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బ్లాక్లో ఆయనను కట్టి పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో మెరుగైన సౌకర్యాలు లేవని, చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. సోలార్ ప్యానెల్స్ పని చేయట్లేదని సిబ్బంది వివరించినట్లు చెప్పారు.
చంద్రబాబు మరింత భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని భువనేశ్వరి అన్నారు. భద్రత విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన భద్రత, సౌకర్యాలను కల్పించాలని స్వయంగా ఏసీబీ న్యాయస్థానం జైలు ఉన్నతాధికారులను ఆదేశించిందని, అయినా వారు పాటించినట్లు కనిపించట్లేదని పేర్కొన్నారు.
రాష్ట్రం ఎప్పుడూ నంబర్ వన్గా ఉండాలని అనుక్షణం తపన పడ్డారని, ఇప్పుడు జైలులో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి చెప్పారు. ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోశారని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన ఆయన కోసం పోరాడటానికి అందరూ బయటికి రావాలని కోరారు.












Click it and Unblock the Notifications