ఆధిపత్య పోరు: రామసుబ్బా రెడ్డి ముఖం మీదే తలుపులేసిన ఆది వర్గం
కడప: జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు బహిర్గతం అయింది. నియోజకవర్గానికి టిడిపి ఇంఛార్జిగా రామసుబ్బా రెడ్డి ఉండగా, కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కారు. దీంతో, జమ్మలమడుగులో ఆధిపత్య పోరుకు తెరలేచింది.
ఆదినారాయణ రెడ్డి చేరినప్పుడే రామసుబ్బా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు ఆయనను బుజ్జగించారు. అయితే, ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కచ్చితంగా ఉంటుందని ఆది చేరిక సమయంలోనే అందరికీ అర్థమైంది.
తాజాగా, సోమవారం నాడు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. ఈ రోజు రామసుబ్బా రెడ్డి గొరికనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇళ్లకు తాళం వేసి నిరసన తెలిపారు.
ఆదినారాయణ రెడ్డి వర్గానికి గొరిగనూరులో మంచి పట్టు ఉంది. ఈ గ్రామంలో రామసుబ్బా రెడ్డి పర్యటనకు వెళ్లారు. ఆయనకు ఆది వర్గీయులు షాకిచ్చారు. రామసుబ్బా రెడ్డి పర్యటనను వ్యతిరేకించిన ఆది వర్గానికి చెందిన కార్యకర్తలు ఆయన ముఖం మీదే తలుపులేసి నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న ఆదినారాయణ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పట్టున్న గ్రామాల్లో తన అనుమతి లేకుండా రామసుబ్బా రెడ్డి ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారని తెలుస్తోంది. దీనిపై పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తానన్నారు.
కాగా, కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయేలా కనిపించడం లేదు. ఏళ్లుగా ప్రత్యర్థులుగా కొనసాగుతూ వస్తున్న ఆది, రామసుబ్బా రెడ్డిలు ఇటీవలే ఒకే పార్టీ నేతలుగా మారారు. 2014లో వైసిపి నుంచి గెలిచిన ఆది ఇటీవలే సైకిల్ ఎక్కారు.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన యత్నాలు ఓ దశలో ఫలించినట్లే కనిపించినా, ఆ యత్నాలన్నీ విఫలయత్నమేనని తేలుతోంది. ఇటీవలే రామసుబ్బా రెడ్డికి స్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలను ఆదినారాయణ వర్గం బెదిరింపులకు గురి చేసినట్లుగా వార్తలు వచ్చాయి.