పవన్ కల్యాణ్ ను శాసిస్తోన్న బీజేపీ?
ఆంధ్రప్రదేశ్ లో చిత్రమైన రాజకీయం నెలకొంది. అది విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు కారణం.. జనసేన-బీజేపీ మైత్రి. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఢిల్లీ వెళ్లి జనసేనకు టికెట్ కేటాయించామని పవన్ కల్యాణ్ అడిగారు. కానీ భారతీయ జనతాపార్టీయే పోటీ చేసింది. వారికోసం తిరుపతిలో సభలో పాల్గొనడంతోపాటు రోడ్ షో నిర్వహించారు
బద్వేలు ఉప ఎన్నిక సమయంలో పెడచెవిన పెట్టారు
బద్వేలుకు ఉప ఎన్నిక జరిగే సమయంలో పోటీచేసేది మహిళ కాబట్టి అందరం మద్దతిచ్చి తద్వారా ప్రజల మద్దతు కూడగడదామని పవన్ కల్యాణ్ బీజేపీ నాయకులకు సూచించారు. ఈ మాటను పెడచెవిన పెట్టారు. అంతకుముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోకానీ, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కానీ జనసేన పోటీచేయకుండా బీజేపీకి మద్దతిచ్చింది. దీనిపై ఆ పార్టీ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. త్యాగం చేయడానికి కూడా హద్దుంటుందంటూ నిరసన తెలిపారు.
పైన పటారం.. లోన లొటారం
జనసేనకు, బీజేపీకి ఉన్న మైత్రిని చూస్తే పైన పటారం.. లోన లొటారం అన్నట్లుగా ఉంటుంది. ప్రశ్నిస్తానని పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రశ్నల చిక్కుముళ్లలో చిక్కుకుపోయారు. పార్టీని స్థాపించింది ఆయనే.. బలోపేతం చేస్తుందీ ఆయనే.. సినిమాలద్వారా వచ్చే పారితోషికాన్ని పార్టీ కోసం ఖర్చుచేస్తుందీ ఆయనే.. కానీ ఆ పార్టీని బీజేపీ నడిపిస్తోందా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. అందుకు తగ్గట్లుగా కమలం పార్టీ నాయకుల ధోరణి ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బీజేపీ డిక్టేట్ చేస్తోందా?
రానున్న ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలో, ఎవరితో పెట్టుకోకూడదో బీజేపీ నే చెబుతోంది. ఒకరకంగా నియంత్రిస్తోందని చెప్పవచ్చు. జనసేన పార్టీని టీడీపీతో కలవద్దని మా అధిష్టానం చెప్పిందంటూ సోము వీర్రాజు చెబుతున్నారు. ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించకుండా.. జనసేనానిని కనీసం గౌరవించకుండా బీజేపీ వ్యవహరించిన సందర్భాలు కోకొల్లలు.
పవన్ లో ఉన్న మెతక తనాన్ని, మంచితనాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. జనసేనపైకానీ, జనసేనానిపైకానీ తమకు ఏ అధికారం ఉందని డిక్టేట్ చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు తాము ఆయన్ను గౌరవించామని డిక్టేట్ చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించామని డిక్టేట్ చేయాలనుకుంటున్నారు? మూడు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రితో అపాయింట్ మెంట్ ఇప్పించలేకపోయినందుకు డిక్టేట్ చేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలు జనసేన శ్రేణుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఏపీ బీజేపీ నాయకులపైనే ఉంది.