చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ 'కాపు' సెగ: టిడిపికి బిజెపి చెక్ పెట్టేనా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షం తెలుగుదేశం పార్టీని ఢీకొనే దిశగా అడుగులు వేస్తోందా? కాపు సామాజిక వర్గాన్ని తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
2009లో చిరంజీవి వెంట
కాపులను బిజెపి వైపుకు ఆకర్షించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని బిజెపి ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం వెంట నడిచింది.
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్... చంద్రబాబుకు చిక్కులు!
ఆ తర్వాత చిరంజీవి, తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో.. ఆ సామాజిక వర్గం ఒకింత దూరం ఉంది. ఏడాదిన్నర క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆయన టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు.
దీంతో, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఆ కూటమినే బలపరిచిందనే వాదనలు ఉన్నాయి. ఈ కారణంగానే... ఇటీవల పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఆయనను ఏమీ అనవద్దని పార్టీ నేతలను ఆదేశించారు.
రాజధాని భూముల పైన పవన్ కళ్యాణ్ టిడిపిని నిలదీశారు. ప్రత్యేక హోదా పైన కూడా ఎంపీలని ప్రశ్నించారు. టిడిపి నేతలు తొలుత పవన్కు ఘాటుగా సమాధానం చెప్పినప్పటికీ... చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి తగ్గారు. పవన్ కళ్యాణ్ను వ్యతిరేకిస్తే నిన్నటి ఎన్నికల్లో టిడిపికి అండగా ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందిన వారు (కొంతమంది కూడా కావొచ్చు) దూరం అవుతారనే బెంగ చంద్రబాబుకు ఉంది.
ఈ కారణంగా పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు ఈగ వాలనీయలేదని అంటున్నారు. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ చెప్పినందునే రాజధాని భూసేకరణ చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. తద్వారా పవన్ కళ్యాణ్ నిజాయితీగా ప్రశ్నిస్తే, ప్రజల కోసం అడిగితే దానిని పరిగణలోకి తీసుకుంటామనే అంశాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోకి తీసుకు వెళ్లారని చెప్పవచ్చు.

కాపు, పవన్ కళ్యాణ్తో టిడిపికి బిజెపి చెక్ చెప్పేనా?
2019 ఎన్నికల నాటికి తాము అధికారంలోకి వస్తామని, నిర్ణయాత్మక శక్తికి ఎదుగుతామని ఏపీ బిజెపి నేతలు అడపాదడపా ప్రకటనలు చేస్తున్నారు. సోము వీర్రాజు వంటి వారు చంద్రబాబు ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు మండిపడుతున్నారు కూడా.
టిడిపికి మిత్రపక్షంగా ఉంటూనే ఆ పార్టీకి ధీటుగా ఎదగాలని బిజెపి ప్రణాళికతో వెళ్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్సీ. ఇటీవల వీర్రాజు మాట్లాడుతూ... కాపులకు రూ.1000 కోట్ల వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మంత్రి పైడికొండల మాణిక్యాల రావులు పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నారు. మాణిక్యాల రావు... చంద్రబాబు కేబినెట్లో మంత్రి కూడా.
చంద్రబాబు హామీ.. బిజెపి ఒత్తిడి
కాపులను బిసిల్లో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని బిజెపి ఢిల్లీ పెద్దలు.. రాష్ట్ర బిజెపి నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. తద్వారా కాపు సామాజిక వర్గాల్లో పట్టు సాధించాలని సూచించారని తెలుస్తోంది. అంతేకాదు, ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలతో బిజెపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications