పార్టీ ఫిరాయింపు ఎంగిలి మెతుకులు తినడమే: మోహన్ బాబు
హైదరాబాద్: తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ ఇద్దరూ బంధువులేనని సినీనటుడు మోహన్బాబు అన్నారు. తాను త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపు అంటే ఎంగిలి మెత్కులు తినడం లాంటిదని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పార్టీల్లోనే చేరుతానని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు మోహన్ బాబు తన జన్మదినం సందర్భంగా ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరేది ఆయన వెల్లడించలేదు. ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతానని మోహన్ బాబు చెప్పారు.

ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. టిడిపి నుంచి ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు. అయితే, ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వర్తమాన రాజకీయాలపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు.
మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై కూడా ఆయన స్పందించారు. ముద్రగడ పద్మనాభం తమకు చిరకాల మిత్రుడని, విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడని, తన సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications