మోసం: బాబుపై బొత్స, నిజాలు చెప్పాలన్న కన్నా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నదంతా మాయ, మోసమేనని మాజీ మంత్రి. పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జాబు కావాలంటే బాబు రావాలన్నారు గానీ, ఆయన ఇచ్చిన జాబులు ఏమీ లేకపోగా తేసేసిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.
ఇప్పటికైనా తెలుగుదేశం వైఫల్యాల మీద భారతీయ జనతా పార్టీ నిలదీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం మానేసి, తన పాలనతో చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తే మంచిదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. తెలంగాణలో సర్వే పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
బాబు నిజాలు చెప్పాలి: కన్నా
మాజీ మంత్రి, శ్వేతపత్రం పరిశీలన కమిటీ ఛైర్మన్ కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. శనివారం విశాఖపట్నంలో చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపై కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు ఎంతో మేలు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కన్నా డిమాండ్ చేశారు.