రాక్షస గ్యాంగ్: ట్రాప్ చేసి లైంగిక దాడులు, అసభ్య వీడియోలు, ఎమ్మెల్యేల సపోర్ట్
విజయవాడ: తవ్వుతున్న కొద్దీ విజయవాడలోని కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. కాల్ మనీ గ్యాంగ్కు చెందిన 12 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి 35 అసభ్య వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి పెట్టుబడి పెట్టి పది లక్షల రూపాయల వడ్డీలను కాల్ మనీ గ్యాంగ్ రాబట్టినట్లు పోలీసులు కనిపెట్టారు
ఈ రాక్షస గ్యాంగ్కు ముగ్గురు శాసనసభ్యుల మద్దతుతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీల అండదండలు కూడా ఉన్టన్లు పోలీసులు గుర్తించారు. కాకులపాడులోని పేకాట స్థావరాన్ని కూడా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకతను విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాల్మనీ ముసుగులో చాలా మంది మహిళలను ట్రాప్చేసి లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా, కొందరు పెద్దల వద్దకు వారిని పంపుతూ పనులు చక్కబెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చాలాకాలంగా సాగుతున్న అనైతిక వ్యవహారం ఒక్కసారిగా వెలుగు చూసింది.

గ్యాంగ్ బారినపడి జీవితాలు పాడుచేసుకున్న బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. బాధితులు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ను కలిసి గోడు వెలిబుచ్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందాలు గ్యాంగ్లోని కీలక వ్యక్తితోపాటు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు.
పటమటకు చెందిన యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము అనే వ్యక్తి చాలాకాలంగా రాజకీయ, పోలీసు, ప్రముఖుల అండదండలతో కాల్మనీ, వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయనతో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారస్తులకు పరిచయం ఉంది. వీరిలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి సోదరుడు చెన్నుపాటి శ్రీను, ఏపిఎస్పిడిసిఎల్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు మార్లపూడి సత్యానందం, మరికొందరు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
వీరంతా మాఫియాగా ఏర్పడి ఫైనాన్స్ కోసం వచ్చే వారికి డబ్బు సాయంచేసి, తర్వాత అప్పు తీర్చమంటూ వేధింపులకు గురి చేసేవారు. ఈక్రమంలో సదరు వ్యక్తులను తమ అధీనంలోకి తీసుకుని వారి భార్య, లేక సోదరి ఇలా వారి కుటుంబసభ్యులను తమవద్దకు పంపాలంటూ లొంగ దీసుకుంటున్నారు. అదే నేరుగా మహిళలే అప్పు కోసం వీరిని సంప్రదిస్తే, ముందుగా వారిని, ఆ తర్వాత వారి కుమార్తెలను, తద్వారా స్నేహితురాళ్లను ట్రాప్ చేస్తారు. ఈవిధంగా నగరంలో సుమారు రెండు మూడొందల మంది మహిళలు, యువతులు వీరిబారిన పడ్డారు.
వీరికి లొంగిపోయిన మహిళలు, యువతులపై లైంగిక చర్యలకు పాల్పడటమే కాకుండా వీరికున్న సిండికేట్ల వద్దకు పంపుతూ, అదేవిధంగా రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు సరఫరా చేస్తూ వీరి వ్యక్తిగత, వ్యాపార పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇందుకు పోలీసుశాఖలోని కొందరు డిఎస్పీ, సిఐస్థాయి అధికారులకూ గ్యాంగుతో సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
వీరి చెరలోని మహిళలు, యువతులకు మద్యం తాగించి స్టార్ హోటళ్లలో వారి నగ్న దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ వీరి కార్యకలాపాలు చేసుకుపోతున్నారు. ఈక్రమంలో ఓ బాధితురాలు పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈమె తన కుమార్తె ఇంజనీరింగ్ సీటు డబ్బు కోసం ఫైనాన్సియర్ను ఆశ్రయిస్తే డబ్బు ఇచ్చిన గ్యాంగులోని పెద్ద మనుషులు తొలుత ఆమెను, తర్వాత ఆమె కుమార్తెను లైంగికంగా వేధించారు.
ఈక్రమంలో మరికొందరు బాధితులు ముందుకురావడంతో వారి వివరాలు గోప్యంగా ఉంచి సీపి ఆదేశాలతో టాస్క్పోర్స్ ఏసిపిలు ప్రసాద్, మురళీధర్, ఎస్ఐలు సురేష్రెడ్డి, శ్రీనివాస్ సిబ్బందితో నిఘా ఉంచి కీలక నిందితుడైన యలమంచిలి రాముతోపాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లోని చెన్నుపాటి శ్రీను, ఎలక్ట్రికల్ డిఇఇ ఎం సత్యానందం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications