మూడు లేయర్లలో రాజధాని నిర్మాణం: శ్రీకాంత్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర మూడు లేయర్లలో నిర్మిస్తామని సిఆర్డిఎ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రాంత భూముల్లో రెండో పంటకు అనుమతి లేదని, జనవరి నెలాఖరుకల్లా 10 వేల ఎకరాల భూసమీకరణ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న గ్రామాలు అలాగే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వాటిని కలుపుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు. రాజధాని పరిధిలోని వ్యవసాయ భూముల్లో లేఅవుట్లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలపై గుంటూరు కలెక్టర్ను నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు శ్రీకాంత్ తెలిపారు. అందుబాటులో లేని భూమ యజమానులు ఆన్లైన్లో అఫిడవిట్లు సమర్పించేందుకు అవకాశం ఉంటుందని, ఆ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
భూ సమీకరణకు 30 మంది అధికారులను నియమిస్తే ఇప్పటి దాకా 19 మంది విధుల్లో చేరినట్లు ఆయన తెలిపారు. రాజధాని పరిసరాల్లో ప్రైవేట్ వాహనాల వినియోగం ఉండకుండా చూస్తామని ఆయన చెప్పారు. సీఆర్డీఏ సిబ్బందికి సింగపూర్ నిపుణుల బృందంతో శిక్షణ ఇప్పించనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. వందేళ్ల దృష్టిలో పెట్టుకొని రాజధాని భవన నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
జీవనం, పని, విజ్ఞానం, ఆహ్లాదం అంశాలను దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణాలు చేపడతామన్నారు. రాజధాని నిర్మాణంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జూన్ నాటికి నూతన రాజధాని మాస్టర్ప్లాన్ సిద్ధమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications