పాంచ్: విలాసాలు, విదేశీ చదువుల కోసం కారు చోరీ
హైదరాబాద్: విదేశీ చదువుల కోసం దొంగతనానికి పాల్పడిన ఐదుగురు యువకులు పోలీసులకు చిక్కారు. సికింద్రాబాదులోని ఆల్వాల్ పోలీసులు వారిని పట్టుకున్నారు. వివరాలను ఆల్వాల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ మీడియాకు అందించారు.
ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆల్వాల్లోని వెంకటాపురంలో నివసించే గుజ్జల వెంకటరాంరెడ్డి కారు ఈ నెల 17వ తేదీన చోరీకి గురైంది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు సాగించారు.
ఆల్వాల్ పోలీసులు దమ్మాయిగుడాలోని ఓ అపార్టుమెంట్ వద్ద ఆ కారును పట్టుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తును కొనసాగించి నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు యువకులు ఆ కారును దొంగిలించినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు.
కాప్రాలోని జెజె కాలనీకి చెందిన వడ్డమాని మనోజ్ కుమార్ (21), వడ్లమాని వెంకటసాయి వినయ్ కుమార్ (24), వెస్ట్ వెంకటాపురానికి చెందిన వి. సంతోష్ (20), తాళ్ల ప్రేమ్ కుమార్ (20) బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరికి కుషాయిగుడాలో నివసించే ధర్మతేజ (21)తో పరిచయమైంది. ఐదుగురు కూడా కలిసి విలాసాలకు, భవిష్యత్తులో విదేశీ చదువులకు డబ్బు అవసరమవుతుందని చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
తమ పథకంలో భాగంగా ఆ ఐదుగురు వెంకటాపురంలోని వెంకట్రామి రెడ్డి కారును దొంగిలించారు. దాన్ని దమ్మాయిగూడాలోని ఆపార్టుమెంటు వద్ద అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కారు.