ఏపీపై వెంకయ్య హామీ, చంద్రబాబు వల్లేనని కితాబు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెంకయ్య నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అందరికీ స్ఫూర్తి ఇవ్వాలనే స్వర్ణభారతి ట్రస్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వెంకయ్య అన్నారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్య నాయుడని ప్రశంసించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమం చేపడుతోందన్నారు. నైపుణ్యం గల పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చంద్రబాబు నాయుడు చెప్పారు.