క్షమాపణ చెప్పిన చంద్రబాబు - ఆ బాధ్యత తనదేనంటూ..!!
ఏపీలో ముందస్తుగానే ఎన్నికల మూడ్ వచ్చేసింది. వైసీపీ - టీడీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లాలో..చంద్రబాబు ఉత్తరాంధ్రలో సభలు నిర్వహిస్తున్నారు. ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల తరహాలోనూ ఈ సారి సోషల్ ఇంజనీరింగ్ పైన ఫోకస్ పెట్టారు. అదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమం తనకు మరోసారి అధికారం ఇస్తుందనే ధీమాతో ఉన్నారు. చంద్రబాబు అధికారం ఖాయమని చెబుతూనే.. జగన్ ఓట్ బ్యాంక్ ప్లాన్ ను హైజాక్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా చంద్రబాబు వారికి క్షమాపణ చెప్పారు.

వారికి చంద్రబాబు క్షమాపణలు..
టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు విజయనగరం జల్లాలో పర్యటిస్తున్నారు. రాజాం, బొబ్బిలి నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. నాయీబ్రాహ్మణలను మంగలి, రజకులను చాకలి అనకూడదని ఆ పదాలను నిషేధించారని చంద్రబాబు చెప్పారు. అయితే, తన నోటి నుంచి పొరపాటుగా దొర్లిందని వివరణ ఇచ్చారు.
వారికి క్షమాపణ చెబుతున్నానన్నారు. అందరూ నాయీ బ్రాహ్మణులు..రజకులు అని సంబోధించాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఫించను మూడు వేల రూపాయాలకు ఎప్పుడో పెంచేవాళ్లమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాము అధికారం లో ఉన్న సమయంలోనే పించను రెండు వేలకు పెంచామని చెప్పారు. ఇప్పుడు వైసీపీ రూ 250 పెంచి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు.

జగన్ జయహో బీసీ .. నాదీ బాధ్యతంటున్న చంద్రబాబు
కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ విజయవాడలో జయహో బీసీ నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్ బ్యాంక్ ను సుస్థిరం చేసుకొనే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా చంద్రబాబు తన జిల్లాల పర్యటన వేళ ఇదేం ఖర్మ మన బీసీలకు పేరుతో ముఖాముఖి నిర్వహించారు. వెనుకబడిన వర్గాల వారు ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
రాజకీయంగా వారిని పైకి తీసుకొచ్చి నాయకులను చేసింది టీడీపీనే అంటూ చంద్రబాబు వివరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తే తాను 34 శాతానికి తీసుకొచ్చానన్నారు. వెనుకబడిన వర్గాల పైన టీడీపీ అధ్యయనం చేసి బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. బీసీలను ఆదుకొనే బాధ్యత తనదేనని చంద్రబాబు స్పష్టం చేసారు.

ఉత్తరాంధ్రలో బీసీ వర్గాలపై నజర్
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న వ్యూహాలకు కౌంటర్ గా చంద్రబాబు ఉత్తరాంధ్రలో ప్రధాని ఓట్ బ్యాంక్ లను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ దెబ్బతింది. పార్టీకి పట్టుందని చెప్పుకొనే విజయనగరం జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళంలో టీడీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది.
ఉత్తరాంధ్ర వేదికగా కొద్ది రోజులుగా జనసేన తమ కార్యాచరణ అమలు చేస్తోంది. విజయనగరంలో పవన్ పర్యటించారు. జనవరి 12న ఉత్తరాంధ్ర వేదికగా జనసేన యువత లక్ష్యంగా మరో కార్యక్రమం నిర్ణయించింది. ఇటు వైసీపీ విశాఖ పరిపాలనా రాజధాని పేరుతో టీడీపీ - జనసేన ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో, ఇప్పుడు ఉత్తరాంధ్రలో మూడు పార్టీలు చేస్తున్న రాజకీయం ఎవరికి అనుకూలంగా మారుతోందో చూడాలి.












Click it and Unblock the Notifications