చంద్రబాబు దూకుడు: కెసిఆర్, జగన్లకు సవాల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం ఖాయమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడదు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీమాంధ్రను సింగపూర్గా మారుస్తానని, అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని, ఉద్యోగావకాశాలను పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారికంగా విభజన జరగకుండానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సవాల్గా మారింది.
తమతో పొత్తు పెట్టుకున్న బిజెపి అధికారంలోకి రావడం, తనను ముఖ్యమైన ఎన్డీయె భాగస్వామిగా భావిస్తున్న నరేంద్ర మోడీ ప్రధాని కావడం, తనకు అత్యంత సన్నిహితుడై బిజెపి నేత వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి మోడీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండడం చంద్రబాబుకు కలిసి వస్తోంది. ఈ స్థితిలో ఆయన కెసిఆర్కే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సవాల్ విసిరేందుకు సిద్ధపడ్డారు.

నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు దూకుడుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఆ గ్రామాలను సీమాంధ్రలో కలపడం వల్ల సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా సీమాంధ్రకు పోతుందని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ కష్టాలు దండిగా వచ్చే అవకాశం ఉంది. సీలేర్ పవర్ ప్రాజెక్టు కూడా దక్కకుండా పోతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.
రేపు శుక్రవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఢిల్లీలో జలవనరుల మంత్రి ఉమా భారతితో పాటు పలువురు మంత్రులను, ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఈ సమావేశాల్లో ఆయన సీమాంధ్రకు అనుకూలంగా వారిని ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆగమేఘాల మీద పోలవరం ఆర్డినెన్స్ జారీ చేయడం వెనక చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్ర ఉందని హరీష్ రావు ఆరోపించారు.
పౌర విమానయాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు రాజీవ్ గాంధీ పేరు మీద శంషాబాద్ విమానాశ్రయాన్ని ఎన్టీఆర్ పేరు మీదికి మార్చనున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి రాజకీయ ప్రత్యర్థులపై తెలుగుదేశం పార్టీ అనుసరించబోయే వైఖరిని తెలియజేస్తోందని అంటున్నారు. శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరును ఎన్టీఆర్ ఎయిర్పోర్టుగా మారుస్తామని అశోక్గజపతిరాజు వెల్లడించారు. శంషాబాద్లో విమానాశ్రయం నిర్మాణం జరిగిన తర్వాత మొదట ఎన్టీఆర్ పేరే ఉండేదని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు కావాలనే పేరు మార్చారని విమర్శించారు.
వైయస్ జగన్ రాజకీయ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసే విధంగా చంద్రబాబు అడుగులు ఉంటాయని భావిస్తున్నారు. జగన్పై ఉన్న అవినీతి ఆరోపణలు ఆయనకు మంచి అవకాశాన్ని ఇస్తాయని అంటున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారం వివాదంగా మారింది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించే నెపంతో తమను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గురువారంనాడు మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు.
పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లో విజయం సాధించని పార్టీ మనుగడ సాధ్యం కాదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉనికి కోల్పోతోందని చంద్రబాబు మహానాడులో అన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వ సహకారం తీసుకుని పాతుకుపోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications