ఇంటి పోరుకు చంద్రబాబు చెక్: లోకేష్కు క్లియర్
హైదరాబాద్: సీమాంధ్రలో పార్టీ విజయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమస్యలన్నింటినీ పరిష్కరించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఓడించడం ద్వారా చంద్రబాబు తిరుగులేని నాయకుడిగా రుజువు చేసుకున్నారు. దాన్నికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరుకు తెర పడింది. పార్టీలో నాయకత్వం కోసం పోటీ పడుతున్న హరికృష్ణ గానీ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ గానీ మాట్లాడే పరిస్థితి లేకుండా అయింది.
నారా లోకేష్ను పార్టీలో ముందుకు తెస్తున్నారంటూ చంద్రబాబుపై హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలంగా అంతర్గత పోరు సాగించారు. గత మహానాడులో నారా లోకేష్ బొమ్మ పోస్టర్పై చోటు చేసుకోవడాన్ని నందమూరి హరికృష్ణ వ్యతిరేకిస్తూ అలిగి వెళ్లిపోయారు. దాంతో నారా లోకేష్ను పార్టీలోకి తెచ్చే ఆలోచనను చంద్రబాబు వెనక్కి నెట్టారు.
అయితే, ఈసారి మహానాడుకు హరికృష్ణ తనంత తానుగా వచ్చారు. కానీ, ఆయనకు చంద్రబాబు ఏ విధమైన ప్రాధాన్యం ఇవ్వలేదు. వేదికపై బాలకృష్ణకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు హరికృష్ణకు మాత్రం ఇవ్వలేదు. దానికితోడు, మహానాడు పోస్టర్లలో నారా లోకేష్ చిత్రాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పైగా, నారా లోకేష్ వేదికపై నుంచి మాట్లాడారు.

పోస్టర్లపై చిత్రాలు ముద్రించడం, ప్రసంగించే అవకాశం దొరకబుచ్చుకోవడం ద్వారా నారా లోకేష్కు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ లేకుండా పోయిందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ విస్తృతంగా పాల్గొన్నారు. టిడిపి విజయంలో నారా లోకేష్ పాత్ర ఉందని చెప్పడానికి అది వీలు కల్పించింది.
నారా లోకేష్ను పార్టీలోకి తెచ్చి, ఆయనకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడాన్ని బాలకృష్ణ వ్యతిరేకించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయకత్వాన్ని బాలకృష్ణ అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అంతా తానే అయి, వ్యూహరచనల ద్వారా, ప్రచారం ద్వారా, పొత్తుల ద్వారా పార్టీని సీమాంధ్రలో విజయపథాన నడిపించిన ఘనతను దక్కించుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు ముగియడమే కాకుండా నారా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడానికి వీలవుతోంది.












Click it and Unblock the Notifications