ఆ జిల్లాలో 12 సీట్లు ఖరారు చేసిన చంద్రబాబు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన సొంతశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షం ఎక్కువగా మైండ్గేమ్ కు ప్రాధాన్యతనిస్తుండటంతో ఆయన కూడా కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ చాలావరకు అసెంబ్లీ సీట్లను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల పార్టీలో అసమ్మతి ఉంటే వెంటనే గుర్తించవచ్చని, అభ్యర్థులకు సావకాశంగా పనిచేసుకోవడానికి వీలుంటుందని భావిస్తున్నారు. ఈ కారణంతోనే చాలావరకు సీట్లు ఖాయం చేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 12 ఖరారు
అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, మంగళగిరి, తెనాలి, వేమూరు, బాపట్ల, రేపల్లె, పొన్నూరు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గుంటూరు పశ్చిమ, రేపల్లె స్థానాల్లోనే గెలవగలిగింది. మంగళగిరి నుంచి పోటీచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఓటమిపాలయ్యారు. గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందిన మద్దాలి గిరి వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

దాదాపుగా అభ్యర్థులు వీరే..
ప్రస్తుతం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వ్యవహార శైలిని గమనిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలతోపాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన బలమైన టీడీపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో వారే ఖరారని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా, మంగళగిరి నుంచి నారా లోకేష్, వేమూరు నుంచి మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, బాపట్ల నుంచి వేగేశన నరేంద్రవర్మ, రేపల్లె నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట నుంచి డాక్టర్ అరవింద్బాబు, వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్కు దాదాపుగా సీట్లు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నరసరావుపేట నుంచి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు రెండురోజుల క్రితమే సీటు ఖరారు చేసినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.

ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు?
ప్రస్తుతం చంద్రబాబు ఎక్కడ ప్రచారానికి వెళ్లినా అసెంబ్లీ నియోజకవర్గానికి, లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థులను వరుసపెట్టి ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండటంతో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీపడే స్థానాలు మినహా సాధ్యమైనంతవరకు ఒకే నాయకుడున్నచోట సీట్లు ఓకే చేస్తున్నారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 70 నియోజకవర్గాలున్న అధిష్టానం గుర్తించింది. మొత్తం 175 నియోజకవర్గాలకుగాను 70ని మినహాయిస్తే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. జనసేనతో పొత్తు కుదిరిన పక్షంలో తెనాలి నియోజకవర్గంలో మార్పులుండే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications